ముఖ్యమంత్రి చొరవతోనే పట్టణాలకు నిధులు
ఆహ్లాదం కోసమే పార్కుల ఏర్పాటు
మంత్రి గంగుల కమలాకర్
కార్పొరేషన్, ఏప్రిల్ 22: కరీంనగరాన్ని మరింత సుందరంగా తీర్చిదిద్దుతామని రాష్ట్ర బీసీ సంక్షేమ, పౌరసరఫరాల శాఖ మంత్రి గంగుల కమలాకర్ ఉద్ఘాటించారు. సీఎం కేసీఆర్ చొరవతోనే మున్సిపాలిటీల్లో అభివృద్ధి పనులు పరుగులు పెడుతున్నాయని చెప్పారు. గురువారం నగరంలో 59వ డివిజన్లోని జ్యోతినగర్ సీసీ రోడ్డు పనులు, 16వ డివిజన్లోని పద్మనగర్లో 60 లక్షలతో పార్కు నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసి, మాట్లాడారు. ఒకప్పుడు ప్రభుత్వ భూములు, మున్సిపల్ స్థలాల్ని ఖాళీగా ఉంచేవారని, అక్రమార్కులకు అనుకూలంగా వ్యవహరించి భూములు కబ్జాకు గురయ్యాక కోర్టు కేసుల పేరుతో కాలయాపన చేసే పరిస్థితి ఉండేదని దుయ్యబట్టారు. టీఆర్ఎస్ నగరపాలక సంస్థ పగ్గాలు చేపట్టిన తర్వాత అలాంటి భూముల్ని గుర్తించి వాటి పరిరక్షణకు చర్యలు తీసుకుంటున్నామని, ఇంకా స్థలాలు అన్యాక్రాంతం కాకుండా కాపాడుకుంటున్నామని చెప్పారు. కోర్టు కేసుల్లో ఉన్న 15 భూ సమస్యలు పరిష్కరించుకొని ఆ స్థలాల్లో 5 కోట్ల వ్యయంతో అద్భుతమైన పార్కులను తీర్చిదిద్దిన ఘనత టీఆర్ఎస్ ప్రభుత్వానిదేనని చెప్పారు. పద్మనగర్లోని 30 గుంటల స్థలంలో రూ.65 లక్షల వ్యయంతో పార్కును అభివృద్ధి చేస్తామని చెప్పారు. గతంలో ఏడెనిమిది స్థానాల్లో ఉండే కరీంనగర్ ప్రస్తుతం రెండో స్థానానికి పోటీ పడుతున్నదని చెప్పారు. నగరంలో పార్కులు, వాకింగ్ ట్రాక్స్, ప్లే గ్రౌండ్, ఓపెన్ జిమ్ములను ఖాళీ స్థలాల్లోనే ఏర్పాటు చేసి వాటిని కాపాడడంతో పాటుగా అత్యాధునిక సౌకర్యాలను అందజేసేందుకు కృషి చేస్తామన్నారు. ప్రజలు కోరుకున్న అభివృద్ధిని నగరంలో చేసి చూపిస్తామన్నారు.
విజిలెన్స్, టాస్క్ఫోర్స్ను ప్రారంభించాం
జిల్లాలో కొవిడ్కు శిక్షణ అందించే విషయంలో ఎలాంటి ఇబ్బందులు రాకుండా ఉండేందుకు కొవిడ్ విజిలెన్స్, టాస్క్ఫోర్స్ను ప్రారంభించామని మంత్రి పేర్కొన్నారు. బాధితుల అవసరాన్ని ఆసరాగా తీసుకొని రెమ్డెసివిర్ను అత్యధిక రేట్లకు అమ్ముతున్న పలు దవాఖానలపై కఠిన చర్యలు తీసుకుంటామన్నారు. ఎట్టి పరిస్థితుల్లోనూ జిల్లాకు అవసరమైన అన్ని రకాల అత్యవసర మందులు, రెమ్డెసివిర్, ఆక్సిజన్ కొరత లేకుండా చూస్తామని చెప్పారు. ఫార్మా సంస్థలను ఒప్పించి రెమిడెసివిర్ను అందుబాటులో ఉంచామని, ఇండెంట్ ప్రకారం రాకపోతే ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఇక్కడ మేయర్ వై సునీల్రావు, డిప్యూటీ మేయర్ చల్ల స్వరూపారాణి హరిశంకర్, కార్పొరేటర్ బోనాల శ్రీకాంత్, గందె మాధవి మహేశ్, గుగ్గిళ్ల జయశ్రీ, వాల రమణారావు, టీఆర్ఎస్ నాయకులుపాల్గొన్నారు.
ఇవి కూడా చదవండి
రాజస్థాన్కు ఆదిలోనే భారీ షాక్.. 18 పరుగులకే 3 వికెట్లు
కొవిడ్ సెకండ్ వేవ్ తో రికవరీకి పెను సవాల్ : ఆర్బీఐ గవర్నర్