హైదరాబాద్ : రాబోయే నాలుగు రోజుల్లో తెలంగాణలో వర్షాలు కురిసే అవకాశం ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. విదర్భ, మరాఠ్వాడ పరిసర ప్రాంతాల్లో సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల నుంచి 2.1 కిలోమీటర్ల ఎత్తు మధ్య ఏర్పడిన ఉపరితల ద్రోణి బుధవారం బలహీన పడిందని, దక్షిణ తమిళనాడు నుంచి ఇంటీరియర్ కర్ణాటక వరకు సముద్ర మట్టానికి 1.5 కిలోమీటర్ల ఎత్తులో మరో ఉపరితల ఆవర్తనం ఏర్పడిందని పేర్కొంది. దీని ప్రభావంతో ఉరుములు, మెరుపులతో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షం కురుస్తుందని చెప్పింది. అలాగే గంటకు 30-40 కిలోమీటర్ల వేగంతో గాలులు వీస్తాయని పేర్కొంది.
ములుగు, భద్రాద్రి కొత్తగూడెం, ఖమ్మం, నల్లగొండ, సూర్యాపేట, మహబూబాబాద్, యాదాద్రి భువనగిరి, రంగారెడ్డి, హైదరాబాద్, మేడ్చల్ మల్కాజ్గిరి, వికారాబాద్, సంగారెడ్డి, మెదక్, కామారెడ్డి, మహబూబ్నగర్, నాగర్ కర్నూల్, వనపర్తి, నారాయణపేట, జోగులాంబ గద్వాల జిల్లాలో వర్షాలు కురిసే అవకాశం ఉందని పేర్కొంది. ఇదిలా ఉండగా.. బుధవారం రాష్ట్రవ్యాప్తంగా పలు జిల్లాలో వర్షం కురిసింది. అత్యధికంగా సూర్యాపేట జిల్లా నడిగూడెంలో 29.3 మిల్లీమీటర్లు, రాజన్న సిరిసిల్ల జిల్లా రుద్రంగిలో 28.3 మిల్లీ మీటర్ల వర్షాపాతం నమోదైందని వాతావరణ కేంద్రం తెలిపింది.
అలాగే కుమ్రంభీం ఆసిఫాబాద్, మంచిర్యాల, జోగులాంబ గద్వాల, యాదాద్రి భువనగిరి, కరీంనగర్, నల్లగొండ, రంగారెడ్డి, ఖమ్మం, ములుగు, జనగాం, ఆదిలాబాద్ జిల్లాలో అక్కడక్కడ తేలికపాటి నుంచి మోస్తారు వర్షాలు కురిశాయి. మరో వైపు బుధవారం నల్లగొండ ఈఎస్ఎస్ కొండాపురం, కనగల్, పులిచెర్ల, కామారెడ్డిగూడెం, ఘన్పూర్లో 40.9 డిగ్రీలో గరిష్ఠ ఉష్ణోగ్రతలు నమోదయ్యాయని టీఎస్ డీపీఎస్ తెలిపింది.