న్యూఢిల్లీ, ఏప్రిల్ 15:దేశీయ ఐటీ రంగ సంస్థల లాభాల జోరు కొనసాగుతున్నది. ఇప్పటికే టీసీఎస్, ఇన్ఫోసిస్ ఆర్థిక ఫలితాల్లో రెండంకెల వృద్ధిని నమోదు చేసుకోగా..తాజాగా విప్రో కూడా ఇదే జాబితలోకి చేరుకున్నది. గడిచిన ఆర్థిక సంవత్సరం చివరి త్రైమాసికంలో సంస్థ రూ. 2,972 కోట్ల కన్సాలిడేటెడ్ నికర లాభాన్ని గడించింది. 2019-20 ఏడాది ఇదే సమయంలో ఆర్జించిన రూ.2,326.10 కోట్లతో పోలిస్తే ఇది 27.7 శాతం అధికం. సమీక్షకాలంలో కంపెనీ ఆదాయం ఏడాదిప్రాతిపదికన 3.4 శాతం బలపడి రూ.16,245.40 కోట్లకు చేరుకున్నది. అంతక్రితం ఇది రూ.15,711 కోట్లు. దీంట్లో ఐటీ సేవల ద్వారా రూ.15,711 కోట్ల ఆదాయం సమకూరినట్లు బీఎస్ఈకి సమాచారం అందించింది. గడిచిన ఆర్థిక సంవత్సరం మొత్తానికి రూ.61,943 కోట్ల ఆదాయం(1.5 శాతం వృద్ధి)పై రూ.10,796.40 కోట్ల కన్సాలిడేటెడ్ లాభాన్ని ఆర్జించింది.