చెన్నై: ఐపీఎల్ 14లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో పటిష్ట బ్యాటింగ్ లైనప్ కలిగిన ముంబై ఇండియన్స్ ఓ మాదిరి స్కోరుకే పరిమితమైంది. సూర్య కుమార్ యాదవ్(56: 36 బంతుల్లో 7ఫోర్లు, 2సిక్సర్లు) అర్ధశతకానికి తోడు రోహిత్ శర్మ(43: 32 బంతుల్లో 3ఫోర్లు, సిక్స్) రాణించడంతో ముంబై 20 ఓవర్లలో 152 పరుగులకు ఆలౌటైంది. ముంబై భారీ స్కోరు చేయకుండా కోల్కతా బౌలర్లు సమిష్టిగా పోరాడారు. కీలక సమయాల్లో వికెట్లు తీస్తూ స్కోరు వేగానికి అడ్డుకట్ట వేశారు. ఆండ్రీ రస్సెల్(5/15) ఐదు వికెట్లతో విజృంభించగా పాట్ కమిన్స్(2/24) రెండు వికెట్లు పడగొట్టాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకి శుభారంభం దక్కలేదు. ఓపెనర్ క్వింటన్ డికాక్(2) రెండో ఓవర్లోనే పెవిలియన్ చేరాడు. వరుణ్ చక్రవర్తి బౌలింగ్లో డికాక్..త్రిపాఠికి క్యాచ్ ఇచ్చి వెనుదిరిగాడు. ఈ దశలో క్రీజులోకి వచ్చిన సూర్య స్కోరు బోర్డును పరుగులు పెట్టించాడు. ప్రసిధ్ కృష్ణ వేసిన 8వ ఓవర్లో యాదవ్ వరుసగా 6,4,4 బాది 16 రన్స్ సాధించాడు. ఇదే జోరులో 33 బంతుల్లోనే అర్ధశతకం పూర్తి చేసుకున్నాడు. మరింత వేగంగా ఆడాలనుకున్న సమయంలో షకీబ్ బౌలింగ్లో వెనుదిరిగాడు. మరో ఎండ్లో రోహిత్ ధాటిగా ఆడలేకపోయాడు. కమిన్స్ బౌలింగ్లో రోహిత్ ఔటైన తర్వాత రైడర్స్ బౌలర్ల పదునైన బంతులకు మిడిలార్డర్ బ్యాట్స్మెన్ పెవిలియన్ బాట పట్టారు. ముంబై వరుస విరామాల్లో వికెట్లను కోల్పోయింది. ఇషాన్ కిషన్(1) హార్దిక్పాండ్య(15), పొలార్డ్(5) నిరాశపరచడంతో ముంబై భారీ స్కోరు చేయలేకపోయింది.