క్రికెట్లో తలపండిన గురువుపై.. శిష్యుడిదే పైచేయి అయింది. గతేడాది లీగ్లో తొలిసారి ప్లే ఆఫ్స్ చేరకుండానే ఇంటిదారి పట్టిన చెన్నై సూపర్ కింగ్స్ తాజా సీజన్ను ఓటమితో ప్రారంభించగా.. నయా కెప్టెన్ రిషబ్ పంత్ నాయకత్వంలో ఢిల్లీ క్యాపిటల్స్ తొలి మ్యాచ్లోనే దంచికొట్టింది. ఉత్కంఠ పోరాటాలకు అద్వితీయ ఫినిషింగ్ ఇవ్వగల మహేంద్రసింగ్ ధోనీకి టాస్ కలిసిరాకపోగా.. ఓపెనర్లు శిఖర్ ధవన్, పృథ్వీ షా వీరవిహారం చేయడంతో పంత్సేన బోణీ కొట్టింది.
ముంబై: బౌలర్ల క్రమశిక్షణకు ఓపెనర్ల బాధ్యతాయుతమైన ఇన్నింగ్స్లు తోడవడంతో ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్) 14వ సీజన్లో ఢిల్లీ క్యాపిటల్స్ ఖాతా తెరిచింది. శనివారం చెన్నై సూపర్ కింగ్స్తో జరిగిన మ్యాచ్లో ఢిల్లీ 7 వికెట్ల తేడాతో గెలిచింది. టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన ధోనీసేన నిర్ణీత 20 ఓవర్లలో 7 వికెట్లకు 188 పరుగులు చేసింది. సురేశ్ రైనా (36 బంతుల్లో 54; 3 ఫోర్స్, 4 సిక్సర్లు) సీజన్లో తొలి అర్ధశతకం నమోదు చేయగా.. మొయిన్ అలీ (36), సామ్ కరన్ ( 15 బంతుల్లో 34; 4 ఫోర్లు, 2 సిక్సర్లు) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో వోక్స్, అవేశ్ ఖాన్ చెరో రెండు వికెట్లు పడగొట్టారు. లక్ష్యఛేదనలో ఓపెనర్లు శిఖర్ ధవన్ (54 బంతుల్లో 85; 10 ఫోర్లు, 2 సిక్సర్లు), పృథ్వీ షా (38 బంతుల్లో 72; 9 ఫోర్లు, 3 సిక్సర్లు) అర్ధశతకాలతో అలరించడంతో ఢిల్లీ 18.4 ఓవర్లలో 3 వికెట్లకు 190 పరుగులు చేసింది. చెన్నై బౌలర్లలో శార్దూల్ ఠాకూర్ 2 వికెట్లు పడగొట్టాడు. ధవన్కు ‘మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్’ దక్కింది.
ఓ మాదిరి లక్ష్యఛేదనలో ఢిల్లీకి అదిరిపోయే ఆరంభం లభించింది. దేశవాళీల్లో దుమ్మురేపి మంచి జోష్లో ఉన్న యువ ఓపెనర్ పృథ్వీ షాతో పాటు.. శిఖర్ ధవన్ దంచి కొట్టడంతో ఢిల్లీ చూస్తుండగానే లక్ష్యానికి చేరువైంది. తొలి ఓవర్లో ఓపెనర్లు చెరో ఫోర్ కొట్టగా.. మూడో ఓవర్లో పృథ్వీ సిక్సర్ అరుసుకున్నాడు. సామ్ కరన్ ఓవర్లో ధవన్ 4,6 సిక్స్ బాదితే.. శార్దూల్కు పృథ్వీ షా హ్యాట్రిక్ బౌండ్రీలతో స్వాగతం పలికాడు. దీంతో ఆరు ఓవర్లు ముగిసేసరికి ఢిల్లీ వికెట్ నష్టపోకుండా 65 పరుగులు చేసింది. ఈ క్రమంలో పృథ్వీ షా 27 బంతుల్లో.. ధవన్ 35 బంతుల్లో అర్ధశతకాలు పూర్తి చేసుకున్నారు. తొలి వికెట్కు 138 పరుగులు జోడించాక షా ఔట్ కాగా.. విజయానికి 22 పరుగుల దూరంలో శిఖర్ ఔటైనా.. కెప్టెన్ రిషబ్ పంత్ (15 నాటౌట్) చివరి వరకు నిలిచి జట్టును గెలిపించాడు. లీగ్లో చెన్నైపై ఢిల్లీకి ఇది హ్యాట్రిక్ విజయం.
చెన్నై: రుతురాజ్ (సి) ధవన్ (బి) వోక్స్ 5, డుప్లెసిస్ (ఎల్బీ) అవేశ్ 0, అలీ (సి) ధవన్ (బి) అశ్విన్ 36, రైనా (రనౌట్) 54, రాయుడు (సి) ధవన్ (బి) టామ్ కరన్ 23, జడేజా (నాటౌట్) 26, ధోనీ (బి) అవేశ్ 0, సామ్ కరన్ (బి) వోక్స్ 34, ఎక్స్ట్రాలు: 10, మొత్తం: 188/7. , వికెట్ల పతనం: 1-7, 2-7, 3-6, 4-123, 5-137, 6-137, 7-188, బౌలింగ్: వోక్స్ 3-0-18-2, అవేశ్ ఖాన్ 4-0-23-2, అశ్విన్ 4-0-47-1, టామ్ కరన్ 4-0-40-1, మిశ్రా 3-0-27-0, స్టొయినిస్ 2-0-26-0.
ఢిల్లీ: పృథ్వీ షా (సి) అలీ (బి) బ్రేవో 72, ధవన్ (ఎల్బీ) శార్దూల్ 85, పంత్ (నాటౌట్) 15, స్టొయినిస్ (సి) సామ్ కరన్ (బి) శార్దూల్ 14, హెట్మైర్ (నాటౌట్) 0, ఎక్స్ట్రాలు: 4, మొత్తం: 18.4 ఓవర్లలో 190/3.వికెట్ల పతనం: 1-138, 2-167, 3-186, బౌలింగ్: దీపక్ 4-0-36-0, సామ్ కరన్ 2-0-24-0, శార్దూల్ 3.4-0-53-2, జడేజా 2-0-16-0, అలీ 3-0-33-0, బ్రేవో 4-0-28-1.
గతేడాది ఏ మాత్రం ఆకట్టుకోలేకపోయిన చెన్నై సూపర్ కింగ్స్కు ఈ సీజన్ తొలి మ్యాచ్లో శుభారంభం దక్కలేదు. రెండో ఓవర్ నాలుగో బంతికి డుప్లెసిస్ (0) ఔట్ కాగా.. మూడు బంతుల వ్యవధిలో రుతురాజ్ గైక్వాడ్ (5) అతడిని అనుసరించాడు. ఈ దశలో మొయిన్ అలీ, సురేశ్ రైనా నిలకడగా ఆడటంతో పవర్ ప్లే ముగిసే సరికి చెన్నై 33/2తో నిలిచింది. అశ్విన్ను లక్ష్యంగా చేసుకొని విజృంభించిన అలీ వరుస ఓవర్లలో రెండు ఫోర్లు, 2 సిక్సర్లు బాదిన అనంతరం రివర్స్ స్వీప్నకు యత్నించి క్యాట్ ఔటయ్యాడు. రాయుడు (23)కూడా చక్కటి షాట్లు ఆడటంతో చెన్నైకి ఇబ్బంది లేకపోయింది. ఈ దశలో రైనా 32 బంతుల్లో అర్ధశతకం నమోదు చేశాడు. చివర్లో వీరిద్దరితో పాటు ధోనీ (0) కూడా ఔటైనా.. రవీంద్ర జడేజా (26 నాటౌట్)తో కలిసి సామ్ కరన్ ధాటిగా ఆడటంతో చెన్నై మంచి స్కోరు చేయగలిగింది.