సంగారెడ్డి ఏప్రిల్ 8 (నమస్తే తెలంగాణ): యాసంగి ధాన్యం సేకరణకు ముమ్మరంగా ఏర్పాట్లు సాగుతున్నా యి. సంగారెడ్డి జిల్లాలో 143 కొనుగోలు కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ నెల 15 నుంచి ధాన్యం సేకరణ ప్రారంభం కానున్నది. అధికారులు ధాన్యం కొనుగోలుకు అవసరమైన ఏర్పాట్లు చేపడుతున్నారు. ధాన్యం సేకరణకు గన్నీబ్యాగులు తప్పనిసరి. రైతుల నుంచి సేకరించిన ధాన్యం గన్నీబాగ్యుల్లో చేర్చి వాటిని రైస్ మిల్లులకు తరలిస్తారు. జిల్లా పౌరసరఫరాల సంస్థ కొనుగోలు కేంద్రాలకు గన్నీబ్యాగులను చేరవేసే పనిలో నిమగ్నమైంది. 143 కొనుగోలు కేంద్రాల ద్వారా 1.60 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరించాలని అధికారులు లక్ష్యంగా పెట్టుకున్నారు. ధాన్యం సేకరణకు 40,17,058 గన్నీబ్యాగులు అవసరం అవుతాయని పౌరసరఫరాల సంస్థ అంచనా. పౌరసరఫరాల సంస్థ వద్ద 24,53,457 గన్నీబ్యాగులు సిద్ధంగా ఉన్నాయి. మిగితా 15,63,601 గన్నీబ్యాగులను కొత్తగా కొనుగోలు చేయనున్నది. 24,53,457 గన్నీబ్యాగులను కొనుగోలు కేంద్రాలకు తరలిస్తున్నారు. 143 కొనుగోలు కేంద్రాల్లో 80 కొనుగోలు కేంద్రాలను ఐకేపీ, 60 కేంద్రాలను పీఏసీఎస్, మూడు కేంద్రాలను మార్కెట్ కమిటీలు నిర్వహించనున్నాయి. 143 కొనుగోలు కేంద్రాల్లో ధాన్యం సేకరణకు అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నారు. 110 కొనుగోలు కేంద్రాలకు 4,41,000 గన్నీబ్యాగులను తరలించారు. ఐకేపీ ఆధ్వర్యంలో 63 కొనుగోలు కేంద్రాలకు 2,33,500 గన్నీబ్యాగులు చేర్చారు. పీఏసీఎస్ నిర్వహిస్తున్న 46 కొనుగోలు కేంద్రాలకు 2,04,500 గన్నీబ్యాగులు, మార్కెట్ కమిటీ నిర్వహిస్తున్న ఒక కొనుగోలు కేంద్రానికి 3000 గన్నీబ్యాగులను తరలించారు. ఈ నెల 15వ తేదీ వరకు పూర్తిస్థాయిలో 40 లక్షలకుపైగా గన్నీబ్యాగులను కొనుగోలు కేంద్రాలకు చేరవేస్తామని పౌరసరఫరాల సంస్థ అధికారులు చెబుతున్నారు.
18 మిల్లులకు అనుమతులు
యాసంగిలో రైతుల నుంచి సేకరించిన ధాన్యాన్ని మర ఆడించేందుకు 18 రైస్మిల్లులకు అధికారులు అనుమతులు మంజూరు చేశారు. సంగారెడ్డి జిల్లాలో మొత్తం 52 రైస్ మిల్లులు ఉన్నాయి. ఇందులో రా రైస్ మిల్లులు 37, బాయిల్డ్ రైస్ మిల్లులు 19 ఉన్నాయి. యాసంగి సీజన్లో కొనుగోలు కేంద్రాల నుంచి సేకరించిన ధాన్యాన్ని 18 బాయిల్డ్ రైస్ మిల్లులకు అనుమతులు ఇచ్చారు. కొనుగోలు కేంద్రాల నుంచి ధాన్యాన్ని నేరుగా వాహనాల ద్వారా రైస్ మిల్లులకు చేరుస్తారు. రైస్ మిల్లలు తమకు వచ్చిన ధాన్యాన్ని మర ఆడించి కస్టమ్ మిల్లింగ్ కోటా లక్ష్యం మేరకు బియ్యాన్ని ఫుడ్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా(ఎఫ్సీఐ)కి చేరవేస్తారు.
గన్నీబ్యాగుల కొరత రానివ్వం
జిల్లాలో 143 ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేశాం. కొనుగోలు కేంద్రాల్లో అవసరమైన ఏర్పాట్లు చేస్తున్నాం. గన్నీబ్యాగులను కొనుగోలు కేంద్రాల్లో అందుబాటులో ఉంచుతున్నాం. ధాన్యం సేకరణకు 40 లక్షల వరకు గన్నీబ్యాగులు అవసరం. ఇప్పటి వరకు 110 కేంద్రాలకు 4.41 లక్షల గన్నీబ్యాగులను చేరవేశాం.గన్నీబ్యాగుల కొరత లేకుండా అవసరమైన చర్యలు తీసుకుంటున్నాం.
-సుగుణబాయి, డీఎం జిల్లా పౌరసరఫరాల సంస్థ, సంగారెడ్డి