వరంగల్ చౌరస్తా, ఏప్రిల్ 6 : నగరం నడిబొడ్డులో పోలీసుల గస్తీ కానరాకుండా పోయింది. కొంతకాలం క్రితం జరిగిన రెండు ఘటనల్లో ఇద్దరు యువకులు ప్రాణాలు కోల్పోవడంతో పోలీసు ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు ప్రతి గల్లీలో కట్టుదిట్టమైన గస్తీ నిర్వహించారు. కానీ, కొంతకాలం తర్వాత తిరిగి పాత పరిస్థితే కనిపిస్తోంది. దీంతో గతంలో మాదిరిగానే యథావిధిగా రాత్రిపూట వ్యాపారాలు కొనసాగుతున్నాయి. వరంగల్ స్టేషన్రోడ్డుతో పాటు జేపీఎన్ రోడ్, మండిబజార్, కాశీబుగ్గ, బస్టాండ్ సెంటర్లో ఫాస్ట్ ఫుడ్ సెంటర్లు, హోటళ్లు అర్ధరాత్రి వరకు కొనసాగుతున్నాయి. దీనికి తోడు వరంగల్ బస్టాండ్ సమీపంలో మద్యం అమ్మకాలు జరుగుతుండడంతో లక్ష్మీపురం కూరగాయలు, పండ్ల మార్కెట్ పరిసర ప్రాంతంలో మద్యం ప్రియులు రోడ్ల పైనే తాగుతూ ఖాళీ సీసాలను వదిలేసి వెళ్తున్నట్లు స్థానికులు చెబుతున్నారు. ఇటీవలి కాలంలో వరంగల్ చౌరస్తాలోని ఓ టిఫిన్ సెంటర్ ఎదుట యువకులు హంగామా చేయ డం సామాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొట్టింది. దీనికి తోడు నగర ప్రధాన రహదారి అయిన జేపీఎన్ రోడ్డులో తవ్వకాల కారణంగా విద్యుత్ దీపాలు వెలుగకపోవడంతో అటు వైపు పాదచారులు వెళ్లాలంటే భయపడుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత పోలీసు అధికారులు స్పందించి అర్ధరాత్రి వరకు షాపులు నిర్వహించకుండా చర్యలు తీసుకోవడంతో పాటు పట్టణంలో గస్తీ నిర్వహించాలని ప్రజలు కోరుతున్నారు.
ఇవి కూడా చదవండి..
తమిళనాడు పోల్స్ : అభిమానులపై అజిత్ ఆగ్రహం.. సైకిల్పై వచ్చి ఓటేసిన విజయ్..
కొవిషీల్డ్ రెండో డోసు రెండున్నర నెలల తర్వాత ఇస్తే 90 శాతం సమర్థవంతం