వరుస విజయాలతో జోరుమీదున్న టీమ్ఇండియా.. మరో మ్యాచ్ మిగిలుండగానే వన్డే సిరీస్ పట్టేయాలని చూస్తుంటే.. ఈ పోరులో నెగ్గి సిరీస్ సమం చేయాలని ఇంగ్లండ్ భావిస్తున్నది. బ్యాటింగ్ బలానికి బౌలింగ్ బలగం తోడవడంతో పటిష్టంగా కనిపిస్తున్న కోహ్లీసేనకు.. గాయాలతో ఇబ్బంది పడుతున్న ఇంగ్లిష్ జట్టు ఏ మాత్రం పోటీనిస్తుందో చూడాలి!
అహ్మదాబాద్: సీనియర్ల నిలకడగా.. యువ ఆటగాళ్లు దూకుడు తోడవడంతో తొలి వన్డేలో అలవోకగా నెగ్గిన భారత్.. అదే జోరు కొనసాగించి సిరీస్ చేజిక్కించుకోవాలని తహతహలాడుతున్నది. బ్యాటింగ్లో శిఖర్ ధావన్, లోకేశ్ రాహుల్ గాడిన పడటం.. బౌలింగ్లో కొత్త పేసర్ ప్రసిద్ధ్ కృష్ణ రాణించడం భారత్కు కలిసొచ్చే అంశాలు కాగా.. ఇప్పటికే టెస్టు, టీ20 సిరీస్లు కోల్పోయిన ఇంగ్లండ్.. కనీసం ఈ సిరీస్నైనా దక్కించుకోవాలని కృతనిశ్చయంతో ఉంది. తొలి వన్డేలో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డ శ్రేయస్ అయ్యర్ ఈ సిరీస్తో పాటు ఐపీఎల్కు కూడా దూరం కాగా.. అతడి స్థానంలో సూర్యకుమార్ యాదవ్ అరంగేట్రం చేయడం దాదాపు ఖాయమైంది. ఇప్పటికే అరంగేట్ర ఆటగాళ్ల దంచుడుతో విసిగెత్తిపోయిన ఇంగ్లిష్ బౌలర్లు.. సూర్యను ఎలా అడ్డుకుంటారో చూడాలి. రోహిత్ గాయంపై స్పష్టత లేకపోగా.. మిడిలార్డర్లో రిషబ్ పంత్ను తీసుకునే అవకాశాలు లేకపోలేదు. మరోవైపు ఇయాన్ మోర్గాన్ వేలి గాయం వల్ల సిరీస్కు దూరం కాగా బట్లర్ సారథిగా కొనసాగనున్నాడు.