పీర్జాదిగూడ, మార్చి18 : పీర్జాదిగూడ నగరపాలక సంస్థ పరిధిలో రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నది. నగరపాలక పరిధిలోని మేడిపల్లి పంచవటి కాలనీ కమాన్ నుంచి పర్వతాపూర్ అరోరా కళాశాల వరకు బీటీ రోడ్డు పనులు పూర్తయ్యాయి. ఈ ప్రాంతంలో కొత్తగా ఏర్పడుతున్న కాలనీలతో రోజు రోజుకు జనాభా పెరుగుతున్నది. దీంతో వాహనాల సంఖ్య అదే రీతిలో ఉండడంతో ఈ రోడ్డు ద్వారా ప్రయాణించే వాహనదారులు, ప్రజలు ఉదయం,సాయంత్రం ట్రాఫిక్ ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. మున్సిపల్ కౌన్సిల్ సమావేశంలో పాలకవర్గం చొరవతో కౌన్సిల్లో తీర్మానించడంతో రోడ్ల విస్తరణకు మోక్షం లభించింది.
రూ. 1, 65 కోట్ల వ్యయంతో పనులు…
మేడిపల్లి పంచవటికాలనీ నుంచి పర్వతాపూర్ అరోరా ఇంజినీరింగ్ కళాశాల వరకు రోడ్డు నిర్మాణం చేయడానికి రూ. 1.65 కోట్లతో రోడ్డు నిర్మించారు. పెరుగుతున్న జనాభాకు అనుగుణంగా రోడ్డు విస్తరణ పనులకు అధికారులు, పాలకవర్గం చొరవతో రోడ్డు పనులు వేగంతో పూర్తి చేయడంతో ట్రాఫిక్ ఇబ్బందులు తప్పాయి. దశాబ్దాలుగా అధ్వానంగా ఉన్న ఈ రోడ్డు విస్తరణతో పాటు నిర్మాణ పనులు పూర్తవడంతో స్థానికులు, వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ట్రాఫిక్ ఇబ్బందులు దూరం..
పీర్జాదిగూడ కార్పొరేషన్లో రోడ్లను విస్తరించేందుకు చర్యలు తీసుకోవడం సంతోషంగా ఉంది. రోడ్డుకు ఇరుపక్కల కాలనీలు ఏర్పడటంతో జనాభా పెరిగింది. ప్రజల అవసరాలకు తగ్గట్టుగా మేడిపల్లి నుంచి పర్వతాపూర్ వెళ్లే ప్రధాన రహదారిని పెద్దగా నిర్మించడం అభినందనీయం. -ఎం. వెంకటేశ్ , వివేకానంద కాలనీ అధ్యక్షుడు
రోడ్ల విస్తరణకు చర్యలు
పీర్జాదిగూడ మున్సిపల్ కార్పొరేషన్ పరిధి…డివిజన్లలోని ప్రధాన రోడ్ల విస్తరణకు చర్యలు తీసుకుంటున్నాం. నగరపాలక సంస్థలోని అన్ని ప్రాంతాల అభివృద్ధికి కృషి చేస్తున్నాం. అన్ని వర్గాల ప్రజల సహకారంతో కార్పొరేషన్ అభివృద్ధికి మరింత కృషి చేస్తాం. – జక్క వెంకట్రెడ్డి, మేయర్, పీర్జాదిగూడ కార్పొరేషన్