మార్చి 31.. ఆర్థిక సంవత్సరం చివరి రోజు మాత్రమే కాదు. అనేక ఆర్థిక అంశాలకు సంబంధించిన డెడ్లైన్. ఈ ఏడాదిలో ఉన్న గడువులు గతంలో మరే ఏడాదిలోనూ లేవు. అవేంటో ఓసారి చూద్దాం.
ఆధార్తో పాన్ లింకు
పాన్ నంబర్ను ఆధార్తో లింక్ చేయడానికి మార్చి 31 తుది గడువు. దీనిని కరోనా కారణంగా జూన్ 30, 2020 నుంచి ఈ ఏడాది మార్చి 31 వరకు పొడిగించారు. ఒకవేళ గడువులోగా ఆధార్తో లింక్ చేయకపోతే పాన్ నంబర్ మనుగడలో ఉండదు.
ఐటీఆర్ దాఖలు
ఆడిటింగ్ అవసరం లేని వ్యక్తులు 2019-20 ఆర్థిక సంవత్సరానికి పన్ను రాబడులను దాఖలు చేయకపోతే, వాటిని దాఖలు చేసుకోవడానికి కూడా ఈ నెలాఖరే తుది గడువు. అయితే ఐదు లక్షల లోపు ఆదాయం ఉన్నవారు వెయ్యి రూపాయల అపరాధ రుసుముతో చెల్లించాల్సి ఉంటుంది. అంతకన్నా ఎక్కువ ఆదాయం ఉన్నవారు రూ.10,000 జరిమానా చెల్లించాల్సి ఉంటుంది. అలాగే పన్ను రాబడుల దాఖలులో పొరపాట్లను సరిదిద్దుకోవడానికి కూడా అదే గడువు.
వివాద్సే విశ్వాస్
పన్ను సంబంధించి సమస్యలను పరిష్కరించడానికి కేంద్రం ప్రవేశపెట్టిన వివాద్సే విశ్వాస్ కింద డిక్లరేషన్ ఇవ్వడానికి కూడా ఈ నెలాఖరే గడువు. ఈ స్కీం కింద పరిష్కారమైన మొత్తాలకూ పన్ను చెల్లించాల్సి ఉంటుంది.
ప్రత్యేక పండుగ అడ్వాన్స్ స్కీం
ప్రభుత్వ ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం వడ్డీ లేని అడ్వాన్స్ స్కీంను అందుబాటులోకి తీసుకొచ్చింది. పదివేల రూపాయల వరకు అడ్వాన్స్ తీసుకునే సదుపాయాన్ని కల్పించింది. దీన్ని పది వాయిదాల్లో తిరిగి చెల్లించాల్సి ఉంటుంది. ఈ స్కీం కింద పదివేల రూపాయల అడ్వాన్స్ తీసుకోవడానికి కూడా ఈ నెలఖరు వరకే.
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన
ప్రధాన మంత్రి ఆవాస్ యోజన పథకం కింద క్రెడిట్ సబ్సిడీ ప్రయోజనాలు పొందడానికి మార్చి 31 తుది గడువు. ఈ ప్రత్యేక స్కీం కింద రూ. 6 18 లక్షల లోపు వార్షిక ఆదాయం ఉన్న మధ్య తరగతి వారు గృహ రుణాలపై సబ్సిడీ పొందేందుకు వీలుంటుంది.
పన్ను ఆదా చేయడానికి మదుపు
2020-21 ఆర్థిక సంవత్సరానికి పన్ను ఆదా చేసుకునేందుకు వివిధ సెక్షన్ల కింద మదుపు చేయడానికి కూడా ఈ నెల చివరి వరకే గడువు. ఒకవేళ ఆదా చేయలేకపోతే మీరు పన్ను చెల్లించుకునే మొత్తాన్ని తగ్గించే అవకాశాన్ని కోల్పోయినట్టే.