పట్నా : పోలీస్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు నాలుగు రోజుల కిందట వెళ్లి అదృశ్యమైన 20 ఏండ్ల గిరిజన యువతి బిహార్లోని బగహ జిల్లాలోని ఓ కాల్వలో శవమై తేలింది. పోలీస్ కానిస్టేబుల్ రిక్రూట్మెంట్ పరీక్షకు హాజరయ్యేందుకు మార్చి 14న బెటా నుంచి వెళ్లిన యువతి ఆపై ఇంటికి తిరిగిరాలేదు. యువతి చివరిసారిగా ఆదివారం రాత్రి 8 గంటలకు పరీక్ష రాసి ఆటోలో ఇంటికి తిరిగివస్తూ తమతో మాట్లాడిందని కుటుంబ సభ్యులు తెలిపారు. కొద్దిగంటల తర్వాత ఆమె ఫోన్ స్విచాఫ్ అయిందని, అర్ధరాత్రి దాటినా యువతి ఇంటికి చేరుకోకపోవడంతో మరుసటి రోజు ఉదయం కుటుంబసభ్యులు చితహ పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.
వారి ఇంటికి మూడు కిలోమీటర్ల దూరంలోని గ్రామంలో బుధవారం ఆమె మృతదేహాన్ని పోలీసులు గుర్తించారు. యువతి మృతదేహం అర్ధనగ్నంగా పడిఉందని కుటుంబ సభ్యులు ఆవేదన వ్యక్తం చేశారు. పోస్ట్మార్టం నిమిత్తం మృతదేహాన్ని బగహ సబ్డివిజనల్ దవాఖానకు తరలించారు. యువతిపై ఆటో డ్రైవర్ లైంగిక దాడికి పాల్పడి హత్య చేసి ఉంటాడని అనుమానిస్తున్నారు. స్దానికులు ఆటో డ్రైవర్ను పట్టుకుని పోలీసులకు అప్పగించారు. పోలీసుల విచారణలో ఆటో డ్రైవర్ నేరాన్ని అంగీకరించాడు. ఈ ఘటనపై పెద్ద సంఖ్యలో స్ధానికులు పోస్టుమార్టం చేపట్టిన దవాఖాన ఎదుట ఆందోళనకు దిగారు. నిందితుడిపై కఠిన చర్యలు చేపట్టాలని డిమాండ్ చేశారు.