గల్ఫ్ దేశాలు వారిని త్వరగా పనిలో చేర్చుకుంటాయని భావిస్తున్నాం
దేశీయంగానూ ఉపాధికి చర్యలు.. పార్లమెంట్లో విదేశాంగ మంత్రి
న్యూఢిల్లీ, మార్చి 15: కరోనా సంక్షోభం నేపథ్యంలో విదేశాల్లోని భారత కార్మికులు, విద్యార్థుల అవస్థలపై ప్రభుత్వానికి పూర్తి అవగాహన ఉన్నదని, వందేభారత్ మిషన్ ద్వారా ఇప్పటివరకు 45.82 లక్షల మందిని స్వదేశానికి తీసుకొచ్చినట్టు విదేశాంగ మంత్రి జైశంకర్ సోమవారం పార్లమెంట్కు తెలిపారు. విదేశాల నుంచి తిరిగి వచ్చిన కార్మికులకు ఉద్యోగాల కల్పనపై ప్రభుత్వం దృష్టిసారించిందని చెప్పారు. అలాగే వారిని వీలైనంత త్వరగా తిరిగి ఉద్యోగాల్లో చేర్చుకునే విషయంపై గల్ఫ్ దేశాలతోనూ కేంద్రం సంప్రదింపులు జరుపుతున్నదని తెలిపారు. కార్మికులను తిరిగి వారు పనిచేస్తున్న దేశాలకు తరలించే విషయంపై ప్రత్యేకంగా దృష్టిపెట్టామన్నారు. ఇప్పటివరకు 27 దేశాలతో విమాన రాకపోకలకు ఒప్పందాలు చేసుకున్నామని చెప్పారు.
వైద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్ పరీక్షను ఈ ఏడాది ఒక్కసారి మాత్రమే నిర్వహించనున్నట్టు కేంద్ర మంత్రి రమేశ్ పోఖ్రియాల్ స్పష్టంచేశారు. ఇంజనీరింగ్ ప్రవేశపరీక్ష జేఈఈ మెయిన్స్ను ఏడాదికి నాలుగుసార్లు నిర్వహించనున్నట్టు విద్యాశాఖ ప్రకటించినప్పటి నుంచి నీట్ను కూడా రెండు సార్లు నిర్వహించాలన్న విజ్ఞప్తులు వస్తున్నాయి.
దేశంలోని ఆరు ఫార్మాస్యూటికల్ ఎడ్యుకేషన్, రిసెర్చ్ ఇన్స్టిట్యూట్లకు జాతీయ ప్రాధాన్య హోదా కల్పించేందుకు ఉద్దేశించిన బిల్లును కేంద్ర మంత్రి సదానందగౌడ సోమవారం పార్లమెంట్లో ప్రవేశపెట్టారు. హైదరాబాద్, అహ్మదాబాద్, గువాహటి, హాజీపూర్, కోల్కతా, రాయ్బరేలీలో ఈ సంస్థలు ఉన్నాయి.
బ్రిటన్లో జాతివివక్ష ఘటనలపై అవసరమైనప్పుడు ఆ దేశం ఎదుట లేవనెత్తుతామని జైశంకర్ రాజ్యసభలో వెల్లడించారు. జాతి వివక్ష, సైబర్ వేధింపుల కారణంగా భారత సంతతికి చెందిన రష్మీ సామంత్ ఆక్స్ఫర్డ్ యూనివర్సిటీ స్టూడెంట్ యూనియన్ అధ్యక్ష పదవికి రాజీనామా చేసిన ఘటనపై బీజేపీ ఎంపీ అడిగిన ఓ ప్రశ్నకు ఆయన ఈ మేరకు సమాధానమిచ్చారు.