న్యూఢిల్లీ: దేశ రక్షణలోనే కాదు, సమాజ సేవలో కూడా తాము ముందుంటామనే విషయాన్ని మరోసారి నిరూపించారు మన ఆర్మీ జవాన్లు. జమ్ముకశ్మీర్ రాష్ట్రం కుప్వారా జిల్లాలో పురిటి నొప్పులతో బాధపడుతున్న ఓ గర్భిణిని సమయానికి ఆస్పత్రికి చేర్చి శభాష్ అనిపించుకున్నారు. వేసవి సమీపించినా కుప్వారాలో భారీగా మంచు కురుస్తున్నది. దాంతో రోడ్లపై పెద్ద ఎత్తున మంచు పేరుకుపోయి జనం రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
ఈ క్రమంలో గురువారం జిల్లాకు చెందిన ఓ గర్భిణికి పురిటి నొప్పులు వచ్చాయి. ఆస్పత్రికి తీసుకెళ్దామంటే రోడ్లపై దట్టంగా మంచు పేరుకుపోవడంతో కుటుంబసభ్యులకు వీలుపడలేదు. ఈ విషయం ఆర్మీ సిబ్బందికి తెలియడంతో వారు వెంటనే స్పందించారు. గర్భిణి ఇంటిదాకా వాహనం వెళ్లే పరిస్థితి లేకపోవడంతో ఆమెను మంచంపై పడుకోబెట్టి భుజాలపై మోసుకెళ్లారు. కొంతదూరం తర్వాత ఆమెను హవానంలోకి ఎక్కించి ఆస్పత్రికి చేర్చారు. కింది వీడియోలో మీరు కూడా ఆ దృశ్యాలను వీక్షించవచ్చు.