హైదరాబాద్ : భర్తను చంపి ఇంటి వెనకాలే పూడ్చిపెట్టిన కేసులో భార్యను అరెస్టు చేసిన పోలీసులు తాజాగా పరారీలో ఉన్న మరొక వ్యక్తిని అరెస్టు చేశారు. నగరంలోని వనస్థలిపురం పోలీస్ స్టేషన్ పరిధిలో చోటుచేసుకున్న కేసు వివరాలిలా ఉన్నాయి. గగన్ అగర్వాల్(38), నౌషిన్ బేగం ఇరువురు దంపతులు. నౌషిన్.. గగన్కు రెండో భార్య. రెండేళ్లక్రితమే మొదటి భార్యకు విడాకులు ఇచ్చి గడిచిన జూన్లో నౌషిన్ బేగంను పెండ్లి చేసుకున్నాడు. కాగా గగన్ ఒక్కసారిగా ఎవరికి కనిపించకుండా పోయాడు. దీంతో గగన్ అదృశ్యంపై ఆయన సోదరుడు వదినను నిలదీశాడు.
దీంతో గగన్ కనిపించట్లేదని పేర్కొంటూ ఎల్బీనగర్ పోలీసు స్టేషన్లో నౌసిన్ బేగం ఫిర్యాదు చేసింది. ఫిర్యాదు అనంతరం అజ్ఞాతంలోకి వెళ్లింది. పోలీసులు అదుపులోకి తీసుకుని ప్రశ్నించగా తానే చంపినట్లు అంగీకరించింది. గగన్ స్నేహితుడు సునీల్ సాయంతో కత్తితో హత్య చేసి ఇంటి వెనకాలే పాతిపెట్టినట్లు వెల్లడించింది. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు గగన్ మృతదేహాన్ని పోలీసులు వెలికితీశారు. క్లూస్ టీం ఘటనాస్థలిలో ఆధారాలు సేకరించింది. పరారీలో ఉన్న గగన్ అగర్వాల్ స్నేహితుడు సునీల్ను పోలీసులు అరెస్టు చేశారు.