సిటీబ్యూరో, మార్చి 10(నమస్తే తెలంగాణ): దేశ వ్యాప్తంగా ప్యాకేజింగ్ టెక్నాలజీకి అత్యంత ఆదరణ కనబడుతున్నది. ఈ కోర్సు పూర్తి చేసిన వారికి వంద శాతం ప్లేస్మెంట్ లభిస్తున్నది. దీంతో ప్యాకేజింగ్ రంగంపై యువత ఆసక్తి చూపుతున్నది. ఈ నేపథ్యంలో ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సును ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ ప్యాకేజింగ్ (ఐఐపీ)తో జేఎన్టీయూహెచ్ పీజీడీపీ/ ఎంఎస్సీ ప్యాకేజింగ్ టెక్నాలజీ కోర్సుల అంశంపై పరస్పర అవగాహన ఒప్పందం కుదిరింది. జేఎన్టీయూహెచ్ ఇన్చార్జి వైస్ చాన్స్లర్, ఐటీ శాఖ కార్యదర్శి జయేశ్ రంజన్, ఐఐపీ ముంబయి డైరెక్టర్ ప్రొఫెసర్ తన్వీర్ అలామ్ ఎంవోయూ చేసుకున్నారు. బుధవారం బీఆర్కే భవన్లో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ఐఐపీ, జేఎన్టీయూహెచ్ అధికారుల మధ్య ఎంవోయూ జరిగింది.
ముంబయిలో ఉన్న ఐఐపీ ప్రస్తుతం హైదరాబాద్లో కూడా తన క్యాంపస్ నడిపిస్తున్నది. కేంద్ర వాణిజ్య పరిశ్రమల శాఖకు అనుబంధంగా ఐఐపీ పని చేస్తున్నది. ఈ క్రమంలో పోస్టు గ్రాడ్యుయేషన్ డిప్లొమా ఇన్ ప్యాకేజింగ్ (పీజీడీపీ) కోర్సును పూర్తి చేసిన వారందరికీ వంద శాతం ఉద్యోగాలు వస్తున్నాయి. ఎంవోయూ సందర్భంగా జేఎన్టీయూహెచ్ రిజిస్ట్రార్ ప్రొఫెసర్ మంజూర్ హుస్సేన్ మాట్లాడుతూ మంచి అవకాశాలు ఉన్న ప్యాకేజింగ్ రంగంలో ఉన్న కోర్సులను అందించడంతో తెలంగాణ యువతకు పెద్ద ఎత్తున ఉద్యోగ అవకాశాలు వస్తాయన్న లక్ష్యంతో ఐఐపీతో అవగాహన చేసుకున్నామన్నారు. ఈ కోర్సుకు గుర్తింపుతోపాటు అకడమిక్ సపోర్టు కూడా ఇస్తామన్నారు.