అంబర్పేట : బ్రాహ్మణుల సంక్షేమాన్ని సీఎం కేసీఆర్ ఏనాడూ విస్మరించలేదని ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత అన్నారు. తిలక్నగర్లోని ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ను బుధవారం ఆమె సందర్శించారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఎమ్మెల్సీ కవిత మాట్లాడుతూ సంకల్పం బలంగా ఉంటే కచ్చితంగా అనుకున్న లక్ష్యాన్ని చేరుకోవచ్చని అన్నారు. పక్కా ప్లాన్తో ఒక సంస్థను నడిపిస్తే అది మరింత ముందుకు వెళ్తుందన్నారు. కమ్యూనిటీ కోసం ఏర్పాటు చేసే ఆర్గనైజేషన్లు సభలు పెట్టి రాజకీయ ఉపన్యాసాలు ఇస్తారు, కానీ కిందస్థాయి వరకు వెళ్లరని అన్నారు. సీఎం కేసీఆర్ కూడా 2001లో ఒక్కరే బయలుదేరారని, ఇప్పుడు రాష్ట్రమే వచ్చిందని తెలిపారు.
అలాగే డా.కమలాకర్శర్మ కూడా ఒక్కరే బయలుదేరారని, ఇప్పుడు ధన్వంతరి ఫౌండేషన్లో ప్రపంచ వ్యాప్తంగా మూడు లక్షల మంది ఉన్నారని అభినందించారు. బ్రాహ్మణుల కోసం బ్రాహ్మణ పరిషత్, బ్రాహ్మణ భవనం కడుతున్నారని తెలిపారు. టీఆర్ఎస్ ఎప్పుడైనా నిజమే మాట్లాడిందని, మాట్లాడిన విషయం చేసి చూపెట్టిందని అన్నారు. కార్యక్రమంలో ఎమ్మెల్యే కాలేరు వెంకటేశ్, ఎమ్మెల్సీ నారదాసు లక్ష్మణ్రావు, దేవీప్రసాద్, కార్పొరేటర్ దూసరి లావణ్య, మాజీ కార్పొరేటర్ గరిగంటి రమేశ్, ధన్వంతరి ఫౌండేషన్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు పాల్గొన్నారు.