హైదరాబాద్ : ఉద్యోగుల సమస్యల పరిష్కారానికి సీఎం కేసీఆర్ హామీ ఇచ్చినట్లు రాష్ట్ర ఉద్యోగ సంఘాల నేతలు తెలిపారు. మంగళవారం సీఎంతో సమావేశం అనంతరం ఉద్యోగ సంఘాల నేతలు మీడియాతో మాట్లాడుతూ.. పీఆర్సీలో తెలంగాణ ప్రభుత్వం అన్యాయం చేయదన్నారు. పీఆర్సీపై చాలా స్పష్టంగా చెప్పారని.. సీఎం కేసీఆర్పై నమ్మకం ఉందని తెలిపారు. ఎన్నికల నియమావళి ఉండటంతో ప్రకటన చేయలేకపోతున్నట్లు సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ఎన్నికలు ముగిసిన తర్వాత పీఆర్సీ ప్రకటన వస్తుందన్నారు. 2014 తర్వాత దేశంలోనే తెలంగాణలో సీఎం కేసీఆర్ అత్యధిక పీఆర్సీ ఇచ్చినట్లు తెలిపారు. ఉద్యోగుల పదోన్నతులు కూడా త్వరితగతినే ఇచ్చారన్నారు.
ఉద్యోగుల పదవీ విరమణ వయస్సు పెంపు కూడా త్వరలోనే అమలు చేస్తామన్నారు. ఏపీలో ఉన్న ఉద్యోగులను తెలంగాణకు తీసుకురావడానికి సీఎం కేసీఆర్ అంగీకరించి అధికారులకు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు. సీపీఎస్ ఉద్యోగుల కుటుంబాలకు పెన్షన్ స్కీమ్ అమలు చేస్తామన్నారు. ఏపీ కంటే ఎక్కువ పీఆర్సీ ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారన్నారు. ఎన్నికల నియమావళికి లోబడే సీఎం కేసీఆర్తో సమావేశమైనట్లు ఉద్యోగ సంఘాల నేతలు పేర్కొన్నారు.