న్యూఢిల్లీ, మార్చి 5: కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన నూతన వ్యవసాయ చట్టాలకు వ్యతిరేకంగా రైతులు చేపడుతున్న నిరసనోద్యమం శనివారంతో వంద రోజులు పూర్తిచేసుకోనున్నది. చట్టాలను వెనక్కి తీసుకునే వరకు ఉద్యమం ఆగదని ఈ సందర్భంగా రైతు నేతలు స్పష్టంచేశారు. దేశంలోని వివిధ ప్రాంతాలకు చెందిన అన్నదాతలు ఢిల్లీ సరిహద్దుల్లోని సింఘు, టిక్రి, ఘాజీపూర్ వద్ద గత మూడు నెలలుగా నిరసన చేపడుతున్న విషయం తెలిసిందే. ముఖ్యంగా పంజాబ్, హర్యానా, ఉత్తరప్రదేశ్కు చెందిన రైతులు ఇందులో కీలక భూమిక పోషిస్తున్నారు. ఉద్యమం వంద రోజులకు చేరిన నేపథ్యంలో శనివారం బ్లాక్ డేగా పాటించనున్నారు. కుండ్లి-మానేసర్-పల్వాల్ ఎక్స్ప్రెస్ వేను 5 గంటలపాటు దిగ్బంధించనున్నారు.
సోమవారం (మార్చి 8న) అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని టైవ్ు మ్యాగజైన్ తమ మార్చి సంచిక కవర్పేజీని భారత మహిళా రైతుల ఫొటోతో తీసుకొచ్చింది. నూతన సాగు చట్టాలకు వ్యతిరేకంగా ఢిల్లీ సరిహద్దుల్లో రైతు ఉద్యమంలో పాల్గొన్న మహిళల ఫొటోతో కూడిన ఈ కవర్పేజీని ఆ పత్రిక శుక్రవారం ట్విట్టర్లో విడుదల చేసింది. ‘నన్ను బెదిరించలేరు.. నన్ను కొనలేరు’ అనే శీర్షికతో ఈ కథనాన్ని ప్రచురించింది.