ఎన్నికల వేళ కేరళలో సంచలనం
సీఎం పర్యవేక్షణలోనే బంగారం స్మగ్లింగ్
నిందితురాలు స్వప్న సురేశ్ ఆరోపణ
స్పీకర్, ముగ్గురు మంత్రులకూ ప్రమేయం..
వివరాలతో హైకోర్టుకు కస్టమ్స్శాఖ అఫిడవిట్
కొచ్చి, మార్చి 5: సరిగ్గా నెలరోజుల్లో అసెంబ్లీ ఎన్నికలు జరగనున్న వేళ కేరళలో రాజకీయం భారీ కుదుపునకు లోనైంది. బంగారం స్మగ్లింగ్ వ్యవహారంలో రాష్ట్ర సీఎం పినరాయి విజయన్కు సంబంధం ఉన్నట్టు కేసులో ప్రధాన నిందితురాలు స్వప్న సురేశ్ ఆరోపించారు. ఆయన సూచనల మేరకే రూ.1.3 కోట్ల విలువైన విదేశీ నగదును యూఈఏ కాన్సులేట్ అధికారి మస్కట్కు పంపినట్టు పేర్కొన్నారు. ఈ వ్యవహారంలో కేరళ స్పీకర్ శ్రీరామకృష్ణన్తో పాటు ముగ్గురు మంత్రులు కూడా ఉన్నట్టు స్వప్న తెలిపారు. ఈ వివరాలతో కూడిన అఫిడవిట్ను కస్టమ్స్ అధికారులు కేరళ హైకోర్టులో దాఖలు చేశారు. ‘సీఎం విజయన్ అరబ్బీలో మాట్లాడలేరు. అందుకే యూఏఈ కాన్సులేట్ జనరల్కు, విజయన్కు మధ్య స్వప్న సంధానకర్తగా వ్యవహరించారు’ అని అందులో పేర్కొన్నారు. గతేడాది జూలైలో తిరువనంతపురంలోని యూఏఈ కాన్సులేట్కు వస్తున్న పార్శిల్లో 15 కోట్లు విలువ చేసే 30 కిలోల బంగారాన్ని కస్టమ్స్ అధికారులు గుర్తించారు. ఈ వ్యవహారం కేరళను కుదిపివేసింది. స్మగ్లింగ్తో సీఎం విజయన్కు సంబంధం ఉన్నట్టు ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నాయి.
ఎన్నికల్లో లబ్ధి పొందాలన్న ఉద్దేశంతోనే బీజేపీ అఫిడవిట్ను తెరమీదకు తెచ్చిందని సీపీఎం ఆరోపించింది. కేంద్ర దర్యాప్తు సంస్థలు ఎన్నికల ఆటలో బీజేపీ చేతిలో పావులుగా మారాయని విమర్శించింది.
కస్టమ్స్ అధికారుల అఫిడవిట్పై కాంగ్రెస్ స్పందించింది. తమ ఆరోపణలు నిజమయ్యాయని, విజయన్పై వెంటనే చర్యలు తీసుకోవాలని కేరళ కాంగ్రెస్ నేత రమేశ్ చెన్నితలా డిమాండ్ చేశారు. ఆధారాలున్నప్పటికీ విజయన్పై ఇంకా ఎందుకు చర్యలు తీసుకోవడంలేదని ప్రశ్నించారు.