ధరల తగ్గింపుపై కేంద్రం, రాష్ర్టాలు కలిసి నిర్ణయం తీసుకోవాలి
జీఎస్టీ పరిధిలోకి పెట్రోల్, డీజిల్ నిర్ణయం కౌన్సిల్దే: నిర్మల
న్యూఢిల్లీ, మార్చి 5: వినియోగదారులపై పెట్రోల్, డీజిల్ భారం అధికంగా ఉన్న విషయం వాస్తవమేనని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ అంగీకరించారు. అయితే పన్నుల తగ్గింపుపై కేంద్ర ప్రభుత్వం, రాష్ర్టాలు కలిసి నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని చెప్పారు. పెట్రోల్ ధరలో దాదాపు 60 శాతం, డీజిల్ ధరలో దాదాపు 56 శాతం వాటా కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వాలు విధిస్తున్న పన్నులదే కావడం గమనార్హం. శుక్రవారం ‘ఇండియన్ విమెన్ ప్రెస్ కార్ప్స్’ కార్యక్రమం సందర్భంగా మీడియాతో ఆమె మాట్లాడారు. పెట్రోల్, డీజిల్పై పన్నులు విధించడం ద్వారా కేంద్రం, రాష్ర్టాలు ఆదాయం పొందుతున్నాయని, అయితే కేంద్రం వసూలుచేసిన పన్నుల్లో 41 శాతం వాటా రాష్ర్టాలకు వెళ్తున్నదని మంత్రి గుర్తుచేశారు. ధరల తగ్గింపు విషయం ‘ధర్మ సంకట’ మేనని అన్నారు. పెట్రోల్, డీజిల్ను జీఎస్టీ పరిధిలోకి తెచ్చే విషయంపై ప్రశ్నించగా.. దీనిపై జీఎస్టీ కౌన్సిలే నిర్ణయం తీసుకోవాల్సి ఉన్నదని బదులిచ్చారు. 2020 మార్చి-ఏప్రిల్ మధ్య కేంద్రం పెట్రోల్ మీద రూ.13, డీజిల్పై రూ.16 ఎక్సైజ్ సుంకం విధించింది. జీఎస్టీ పరిధిలోకి తెస్తే లీటర్ పెట్రోల్ రూ.75కు, డీజిల్ రూ.68కి దిగివస్తుందని ఎస్బీఐకి చెందిన ఆర్థికవేత్తలు ఈ వారం ప్రారంభంలో ఒక నివేదిక వెలువరించారు.
నటి తాప్సీ, దర్శకుడు అనురాగ్ కశ్యప్ నివాసాల్లో ఐటీ శాఖ సోదాలు నిర్వహించడాన్ని నిర్మల సమర్థించుకున్నారు. 2013లోనూ వారిపై ఐటీ శాఖ దాడులు నిర్వహించిందని, కానీ ఇప్పుడు జరుగుతున్నంతగా అప్పుడు చర్చ జరుగలేదన్నారు. ఫాంటమ్ ఫిల్మ్స్ పన్ను ఎగవేతపై తాప్సీ, కశ్యప్తోపాటు పలువురు బాలీవుడ్ ప్రముఖుల నివాసాలు, ఆఫీసుల్లో ఐటీశాఖ సోదాలు నిర్వహించింది.