చేర్యాల, జూలై 20 : ముక్కోటి వృక్షార్చన కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి పిలుపునిచ్చారు. ఐటీ శాఖ మంత్రి కేటీఆర్ పుట్టిన రోజును పురస్కరించుకుని నిర్వహించనున్న ముక్కోటి వృక్షార్చాన కార్యక్రమంలో భాగంగా మంగళవారం పట్టణంలో వాసవీ గార్డెన్ ఫంక్షన్ హాలులో చేర్యాల, కొమురవెల్లి, మద్దూరు, ధూళిమిట్ట మండలాల ప్రజాప్రతినిధులు, ఎంపీడీవోలు, ఏపీవోలు, కార్యదర్శులు, టెక్నికల్ అసిస్టెంట్లతో సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ నాడు సీఎం కేసీఆర్ ఒకే ఒక్కడుగా ముందుకు సాగి తెలంగాణను సాధించాడని తెలిపారు. నియోజకవర్గంలో 2.60లక్షల మొక్కలు నా టేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు చెప్పారు. నేటి నుంచే మొక్కలు నాటే కార్యక్రమాన్ని ప్రజాప్రతినిధులు ప్రారంభించాలని పిలుపునిచ్చారు. సీఎం కేసీఆర్ రాష్ట్ర అభివృద్ధికి కృషి చేస్తుంటే ఓర్వలేక పీసీసీ అధ్యక్షుడు రేవంత్రెడ్డి, తెలంగాణ బీజేపీ అధ్యక్షుడు బండి సంజయ్ నోరు పారేసుకుంటున్నారని మండిపడ్డారు. వారికి దమ్ము, ధైర్యం ఉంటే కేంద్రంతో పోరాడి రాష్ర్టానికి న్యాయపరంగా రావాల్సిన రూ.లక్ష40వేల కోట్లను తీసుకురావాలని హితవు పలికారు. అభివృద్ధి చెందుతున్న తెలంగాణను చూస్తే సోయి రావడం లేదా అని ప్రశ్నించారు.
దళితుల కుటుంబాల్లో వెలుగులు నింపేందుకు సీఎం కేసీఆర్ త్వరలో ప్రారంభించనున్న దళిత బంధు పథకాన్ని చూసి ప్రతిపక్ష పార్టీలు జీర్ణించుకోలేకపోతున్నాయని విమర్శించారు. ప్రజాప్రతినిధులు, నాయకులు వారి గ్రామాల్లో నాటిన మొక్కలు పడిపోతే వాటిని సరిచేసి వాట్సాప్ గ్రూపుల్లో పోస్టు చేసి ఇతరులకు ఆదర్శంగా నిలువాలన్నారు. జనగామ నుంచి దుద్దెడ క్రాస్ రోడ్డు వరకు రోడ్డు నిర్మాణానికి రూ.350 కోట్లు సీఎం కేసీఆర్ మంజూరు చేసినట్లు చెప్పారు. సమావేశంలో డీఆర్డీఏ గోపాల్రావు, ఎంపీపీలు బద్దిపడిగె కృష్ణారెడ్డి, వుల్లంపల్లి కరుణాకర్, తలారి కీర్తనకిషన్, జడ్పీటీసీలు శెట్టె మల్లేశం, సిలువేరు సిద్ధప్ప, మార్కెట్ కమిటీ చైర్మన్ సుంకరి మల్లేశంగౌడ్, వైస్ చైర్మన్ పుర్మ వెంకట్రెడ్డి, మున్సిపల్ చైర్పర్సన్ అంకుగారి స్వరూపరాణి, వైస్ చైర్మన్ నిమ్మ రాజీవ్రెడ్డి, మల్లన్న ఆలయ చైర్మన్ గీస భిక్షపతి, పీఏసీఎస్ చైర్మన్ వంగ చంద్రారెడ్డి, వైస్ ఎంపీపీలు నవీన్రెడ్డి, సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు పెడుతల ఎల్లారెడ్డి, వంగ భాస్కర్రెడ్డి, సద్ది కృష్ణారెడ్డి, ఎంపీడీవోలు, ఏపీవోలు, టెక్నికల్ అసిస్టెంట్లు, కార్యదర్శులు, సర్పంచ్, ఎంపీటీసీలు పాల్గొన్నారు.
వేములవాడ రాజన్నను దర్శించుకున్న ఎమ్మెల్యే
తొలి ఏకాదశి పర్వదినం సందర్భంగా ఎమ్మె ల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి కుటుంబ సభ్యులతో కలిసి వేములవాడ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకున్నారు. ఎమ్మెల్యే దంపతులతో పాటు కుటుంబ సభ్యులను ఆలయవర్గాలు స్వాగతం పలికారు. ఎమ్మెల్యే స్వామి వారిని దర్శించుకొని పూజలు నిర్వహించారు.