హుస్నాబాద్, జూలై 14 : హుస్నాబాద్ మండలం పందిల్ల గ్రామ శివారులోని ఎల్లమ్మ వాగుపై ఇటీవల నిర్మించిన చెక్డ్యామ్ పర్యాటకులకు కనువిందు చేస్తున్నది. సుమారు రూ.3 కోట్లతో నిర్మించిన ఈ చెక్డ్యామ్ ఇటీవల కురిసిన వర్షాలకు పూర్తిగా నిండి మత్తడి దుంకుతున్నది. నిండుకుండలా మారిన చెక్డ్యామ్తోపాటు చుట్టు పక్కల ఉన్న పంట పొలాలు, పచ్చని చెట్లను చూసేందుకు నిత్యం జనం తరలివస్తున్నారు. హుస్నాబాద్ పట్టణానికి సమీపంలో.. హుస్నాబాద్-సిద్దిపేట రహదారి కల్వర్టును ఆనుకొని ఉన్న ఈ ప్రదేశం ఆహ్లాదాన్ని పంచుతున్నది. ఎల్లమ్మ వాగుకు రెండు వైపులా దారి కూడా నిర్మించడంతో వాహనాలు సైతం చెక్డ్యామ్ వరకు వెళ్తున్నాయి. హుస్నాబాద్ పట్టణ ప్రజల తోపాటు పందిల్ల, కూచనపల్లి, పొట్లపల్లి తదితర గ్రామాల ప్రజలు, సిద్దిపేట రహదారిపై నుంచి వెళ్లే ప్రయాణికులు చెక్డ్యామ్ను సందర్శిస్తున్నారు. హుస్నాబాద్, పందిల్ల గ్రామాల మధ్య ఉన్న ఈ ప్రాంతం రాబోయే రోజుల్లో మంచి పిక్నిక్ స్పాట్ మారుతుందని ప్రకృతి ప్రేమికులు అభిప్రాయపడుతున్నారు.