టీఎస్ ఐపాస్కు వచ్చిన దరఖాస్తులను పరిశీలించండి
జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో మెదక్ కలెక్టర్ హరీశ్
మెదక్, జూలై 15 : టీఎస్ ఐపాస్కు చేసుకున్న దరఖాస్తులను నిర్ణీత సమయంలో పరిశీలించి అనుమతులు మంజూరు చేయాలని మెదక్ కలెక్టర్ ఎస్.హరీశ్ అధికారులను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్లోని వీడియా కాన్ఫరెన్స్ హాల్లో ఏర్పాటు చేసిన జిల్లా పరిశ్రమల ప్రమోషన్ కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడుతూ టీఎస్ ఐపాస్ కింద జిల్లాలో పరిశ్రమల ఏర్పాటుకు వచ్చిన 1467 దరఖాస్తుల్లో 34 దరఖాస్తులు వివిధ స్థాయిలో పెండింగ్లో ఉన్నాయని అన్నారు. ప్రధానంగా కాలుష్య నియంత్రణ మండలి, టీఎస్ ఐఐసీ, విద్యుత్, కర్మాగారాలు, అగ్నిమాపక, గ్రౌండ్ వాటర్, ఎంఎండీఏ, రెవెన్యూ శాఖల్లో క్లియరెన్స్ ఆమోదం నిమిత్తం ఆ దరఖాస్తులు పెండింగ్లో ఉన్నాయని తెలిపారు. ఆయా శాఖల అధికారులు దరఖాస్తులను క్షుణ్ణంగా పరిశీలించి పెండింగ్లో లేకుండా నిర్ణీత సమయంలో డిస్పోజ్ చేయాలని సూచించారు. ఈ సందర్భంగా టీ-ప్రైడ్ కార్యక్రమం కింద 25 మంది ఎస్సీ, 54 మంది ఎస్టీలకు 35 శాతం సబ్సిడీతో వాణిజ్య వాహనాలు లబ్ధిదారులకు అందించేందుకు కమిటీ ఆమోదం తెలిపింది. ఈ సమావేశంలో అదనపు కలెక్టర్ జి.రమేశ్, జిల్లా పరిశ్రమల అధికారి కృష్ణమూర్తి, విద్యుత్ డీఈ మల్లేశం, లీడ్ బ్యాంకు జిల్లా మేనేజర్ వేణుగోపాల్రావు, మైన్స్ ఏడీ జయరాజ్, టీఎస్ ఐఐసీ ఈవో కేటీ నాయక్, జిల్లా రవాణా శాఖాధికారి శ్రీనివాస్గౌడ్, ఎంఎండీఏ ప్లానింగ్ అధికారి నీలిమ, పొల్యూషన్ కంట్రోల్ బోర్డు గ్రౌండ్వాటర్ డీడీ, అగ్నిమాపక శాఖ అధికారి పాల్గొన్నారు.
మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలి
నర్సాపూర్, జూలై15: మొక్కలపై ప్రత్యేక శ్రద్ధ చూపాలని కలెక్టర్ హరీశ్, అదనపు కలెక్టర్ రమేశ్ అన్నారు. గురువారం నర్సాపూర్ మున్సిపాలిటీ పరిధిలోని ఫుట్పాత్పై మొక్కలు నాటేందుకు తీసిన గుంతలను పరిశీలించారు. అనంతరం మండల పరిధిలోని ఎల్లాపూర్ ఫారెస్ట్ బ్లాక్లో మొక్కలు నాటారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఫుట్పాత్పై పొగడ చెట్లను నాటాలని మున్సిపల్ కమిషనర్కు సూచించారు. ఆ తర్వాత వాచ్టవర్ ఎక్కి గతంలో నాటిన మొక్కలను పరిశీలించి సంతృప్తి వ్యక్తం చేశారు. కార్యక్రమంలో జిల్లా అటవీ శాఖాధికారి జ్ఞానేశ్వర్, మున్సిపల్ కమిషనర్ అశ్రిత్కుమార్, ఫారెస్ట్ రేంజ్ అధికారి అంబర్సింగ్, జడ్పీటీసీ బాబ్యానాయక్ పాల్గొన్నారు.