ఎల్ఆర్ఎస్ దరఖాస్తుల పరిశీలనకు బృందాలు
ప్రభుత్వం నుంచి మార్గదర్శకాలు జారీ
ఉమ్మడి మెదక్ జిల్లాలో16 మున్సిపాలిటీలు
వేల సంఖ్యలో వచ్చిన దరఖాస్తులు
బల్దియాలకు సమకూరిన ఆదాయం
మెదక్ మున్సిపాలిటీ, జూలై 31 : నిబంధనలు పాటించకుండా కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణ(ఎల్ఆర్ఎస్)కు ఇటీవల ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రత్యేక బృందాల ఏర్పాటుకు ఆదేశించింది. ఎల్ఆర్ఎస్కు గతేడాది అక్టోబర్ 31 వరకు ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించింది. కరోనా కారణంగా అప్పట్లో ప్రక్రియను నిలిపివేసింది. కాగా, ఇటీవల మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ఒక్కో బల్దియాలో మూడు చొప్పున ప్రత్యేక అధికార బృందాలు ఏర్పాటు చేస్తున్నారు. ఈ బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి అర్హుల జాబితా రూపొందిస్తాయి. నివేదికను మున్సిపల్ కమిషనర్లకు అందిస్తాయి. కమిషనర్లు కలెక్టర్కు నివేదిస్తారు. కలెక్టర్లు ప్రభుత్వానికి నివేదిక పంపుతారు. ఆ తర్వాత ప్రభుత్వ ఆదేశాల మేరకు క్రమబద్ధీకరిస్తారు. ఉమ్మడి మెదక్ జిల్లాలో 16 మున్సిపాలిటీలు ఉన్నాయి. వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
నిబంధనలు పాటించకుండా కొనుగోలు చేసిన ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు(ఎల్ఆర్ఎస్) ప్రభుత్వం మార్గదర్శకాలు ఇటీవల విడుదల చేసింది. క్షేత్రస్థాయి పరిశీలనకు ప్రత్యేక బృందాలు ఏర్పాటు చేసింది. పల్లెలు, పట్టణాల్లో స్థలాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం గతేడాది అక్టోబర్ 31 వరకు దరఖాస్తులు స్వీకరించింది. అనంతరం కరోనా నేపథ్యంలో ప్రభుత్వం ప్రక్రియను నిలిపివేసింది. తాజాగా మళ్లీ ఉత్తర్వులు జారీ చేసింది. ప్రత్యేక అధికార బృందాలు క్షేత్రస్థాయిలో విచారణ చేపట్టి 15 రోజుల్లో అర్హుల జాబితా రూపొందించనున్నాయి. ముందుగా మున్సిపాలిటీల్లో సర్వే చేయనున్నాయి. అనంతరం, నగర పంచాయతీ, గ్రామ పంచాయతీల్లో సర్వే చేపట్టనున్నాయి.
ప్రక్రియ వేగవంతం..
లే అవుట్ల క్రమబద్ధీకరణ దరఖాస్తుల పరిశీలనను వేగవంతంగా చేసేందుకు మున్సిపల్, పట్టణాభివృద్ధి శాఖ ముఖ్య కార్యదర్శి అరవింద్ కుమార్ మార్గదర్శకాలు జారీ చేశారు. నాలుగు శాఖలతో బృందాలు ఏర్పాటు చేయాలని కలెక్టర్లకు ఆదేశాలు జారీ అయ్యాయి. మున్సిపాలిటీ పరిధిలో వచ్చిన దరఖాస్తులు పరిశీలించి కాలనీ, సర్వే నంబర్ ఆధారంగా విభజించాల్సి ఉంటుంది. అనంతరం రెవెన్యూ, నీటిపారుదల, పంచాయతీరాజ్, పట్టణ ప్రణాళిక విభాగాలతో కలిసి కలెక్టర్ బృందాలు ఏర్పాటు చేయనున్నారు. దరఖాస్తులో ఇచ్చిన సమాచారం మేరకు అధికారులు క్షేత్రస్థాయిలో పరిశీలన చేయనున్నారు. ఎల్ఆర్ఎస్ నిబంధనల మేరకు గల వాటి వివరాలను మున్సిపల్ కమిషనర్లకు అందజేస్తారు. కమిషనర్ జిల్లా కలెక్టర్కు నివేదిస్తారు.
దరఖాస్తులు ఇలా..
మెదక్ జిల్లాలో మెదక్, నర్సాపూర్, రామాయంపేట, తూప్రాన్ మున్సిపాలిటీలు ఉన్నాయి. మెదక్ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్కు 4,200 దరఖాస్తులు వచ్చాయి. రామాయంపేట మున్సిపాలిటీలో 3,000, నర్సాపూర్ మున్సిపాలిటీలో 190, తూప్రాన్ మున్సిపాలిటీలో 600 దరఖాస్తులు వచ్చాయి. వీరంతా ఆన్లైన్లో ఒక ఎల్ఆర్ఎస్ దరఖాస్తుకు రూ.1000 ఫీజు చెల్లించారు. దీంతో మున్సిపాలిటీలకు ఆదాయం సమకూరింది. కొవిడ్-19 నేపథ్యంలో ఎల్ఆర్ఎస్ క్రమబద్ధీకరణ ప్రక్రియను పక్కన పెట్టిన ప్రభుత్వం, ఇటీవల మార్గదర్శకాలు విడుదల చేయడంతో ప్రక్రియ వేగవంతంగా కొనసాగనుంది. సిద్దిపేట జిల్లాలో సిద్దిపేట, దుబ్బాక, హుస్నాబాద్, చేర్యాల మున్సిపాలిటీలు ఉన్నాయి. సంగారెడ్డి జిల్లాలో సంగారెడ్డి, సదాశివపేట, అందోల్, నారాయణఖేడ్, జహీరాబాద్, బొల్లారం, అమీన్పూర్, తెల్లాపూర్ మున్సిపాలిటీలు ఉన్నాయి. వీటిలో కూడా ఎల్ఆర్ఎస్కు వేల సంఖ్యలో దరఖాస్తులు వచ్చాయి.
క్రమబద్ధీకరణకు మార్గదర్శకాలు జారీ..
ఇండ్ల స్థలాల క్రమబద్ధీకరణకు మున్సిపల్ శాఖ ముఖ్య కార్యదర్శి ఇటీవల మార్గదర్శకాలు జారీ చేశారు. ప్రతి మున్సిపాలిటీలో కలెక్టర్ నేతృత్వంలో నాలుగు శాఖలతో బృందాలు ఏర్పాటు చేయనున్నారు. వచ్చిన దరఖాస్తులను బృం దాలు పరిశీలించి సమగ్ర నివేదికను అందజేస్తాయి. మెదక్ మున్సిపాలిటీలో ఎల్ఆర్ఎస్కు 4,200 దరఖాస్తులు వచ్చాయి. ఈ దరఖాస్తులతో మున్సిపాలిటీకి రూ.42 లక్షల ఆదాయం వచ్చింది.