మెదక్, మే 23 : ఆకుపచ్చ తెలంగాణే రాష్ట్ర నిర్మాణామే ధ్యేయంగా ప్రభుత్వం ఏటా ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న హరితహారం కార్యక్రమం విజయవంతంగా కొనసాగుతున్నది. దీంతో సత్ఫలితాలు వస్తున్నాయి. మెదక్ జిల్లాలో 2021-22లో 35 లక్షల మొక్కలు నాటడం లక్ష్యంగా పెట్టుకున్నారు. మెదక్ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో మొక్కలు పెంచుతున్నారు. ఇప్పటికే శాఖల వారీగా కేటాయింపులు చేశారు. 85శాతం మొక్కలు బతికేలా చర్యలు తీసుకోనున్నారు.
ఏడో విడత హరితహారం కార్యక్రమాన్ని ఈసారి పెద్దఎత్తున నిర్వహించేందుకు అధికారులు సన్నద్ధమవుతున్నారు. జూన్లో ప్రారంభంకానున్న హరితహారం కార్యక్రమానికి అవసరమైన మొక్కలను మెదక్ జిల్లాలోని 469 గ్రామ పంచాయతీల్లోని నర్సరీల్లో సిద్ధం చేస్తున్నారు. జిల్లాలో 35.47 లక్షల మొక్కలు నాటాలని లక్ష్యం పెట్టుకోగా, అధికారులు నర్సరీల్లో 78.60 లక్షల మొక్కలను పెంచుతున్నారు. గ్రామ పంచాయతీల్లోని నర్సరీల పర్యవేక్షణ డీఆర్డీవో ఆధ్వర్యంలో కొనసాగుతోంది. మొ క్కల పెంపకం పురోగతిని అధికారులు ఎప్పటికప్పుడు పర్యవేక్షిస్తున్నారు. ప్రస్తుతం 80శాతం మొక్కలు ఆశాజనకంగా పెరుగుతున్నాయని, జూన్ మొదటి వారం నాటికి మరింత పెరిగే అవకాశముందని అధికారులు చెబుతున్నారు.
జిల్లాలో 78 లక్షల మొక్కల పెంపకం..
మెదక్ జిల్లాలో 469 గ్రామ పంచాయతీలోని నర్సరీల్లో 78.60 లక్షల మొక్కలను పెం చుతున్నారు. పల్లెలను హరితహారం కార్యక్రమంలో మరింత భాగస్వామ్యం చేసే లక్ష్యం తో ప్రభుత్వం పంచాయతీల్లో నర్సీరీలను ఏర్పాటు చేసింది. డీఆర్డీఏ ఆధ్వర్యంలో 24 లక్షల మొ క్కలను నాటడం లక్ష్యంగా పెట్టుకోగా, మిగతా మొక్కలను ఆయా శాఖలకు అధికారులు కేటాయించారు. వీటి నిర్వహణ బాధ్యతలను ఎన్ఆర్ఈజీఎస్ చూస్తోంది.
85 శాతం మొక్కలు బతికేలా ప్రణాళికలు..
నాటే మొక్కల్లో కచ్చితంగా 85శాతం బతికేలా చర్యలు తీసుకోనున్నారు. కొత్త పంచాయతీరాజ్ చట్టం ప్రకారం ప్రభుత్వం ఈ నిబంధనలు అమలు చేస్తున్నది. ఇందుకోసం ప్రతి గ్రామ పంచాయతీకి ట్రాక్టర్లు, ట్యాంకర్లు మం జూరు చేసింది. ఈ ట్యాంకర్తో ఏడాది పొడవునా మొక్కలకు నీటి సరఫరా అయ్యేలా చూస్తున్నారు. మొక్కలకు నీరు పోయడం, రక్షించేందుకు వాచర్లను ఏర్పాటు చేశారు. నర్సరీల నుంచి మొక్కలు సరఫరా చేస్తున్నారు. జాతీయ రహదారులు, గ్రామ పంచాయతీలు, ఆర్అండ్బీ రోడ్లు, ఖాళీ స్థలాల్లో మొక్కలు నాటేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారు.