మెదక్, సెప్టెంబర్ 13 : జిల్లాలో గణేశ్ నిమజ్జన వేడుకలు శాంతియుత వాతావరణంలో జరిగేలా అధికారులు సమష్టి బాధ్యతతో పనిచేయాల్సిందిగా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్, అదనపు ఎస్పీ కృష్ణమూర్తి కోరారు. సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాల్లో సంబంధిత అధికారులతో గణేశ్ నిమజ్జనం ఏర్పాట్లను సమీక్షించారు. ఈ సందర్భంగా అదనపు కలెక్టర్లు రమేశ్, ప్రతిమాసింగ్ మాట్లాడుతూ జిల్లాలో ఈ సంవత్సరం 2,124 గణేశ్ మండపాలు ఏర్పాటు చేశారని, ఈ నెల 16 నుంచి 21 వరకు వివిధ రోజుల్లో గణేశ్ నిమజ్జనం చేసే అవకాశమున్నందున మొదటి నుంచి చివరి నిమజ్జనం వరకు చిన్న సంఘటన జరుగకుండా అధికారులు పనిచేసి విజయవంతం చేయాల్సిందిగా కోరారు. నిమజ్జన ప్రదేశాల్లో, చెరువు కట్టలపై లైటింగ్ కోసం నిరంతరాయంగా విద్యుత్ సరఫరా అయ్యేలా చూడాలని అధికారులకు సూచించారు. శోభాయాత్ర, నిమజ్జనం, ట్రాఫిక్ పట్ల ప్రజలను అప్రమత్తం చేయుటకు పబ్లిక్ అడ్రస్ సిస్టం ఏర్పాటు చేసుకోవాలన్నారు. చెరువులు, కుంటలు నిండుగా ఉన్నందున అవసరమైన ప్రాంతాల్లో భారీ కేడింగ్ ఏర్పాటు చేయాలని ఆర్అండ్బీ ఈఈకి సూచించారు. అవసరమైన ప్రాంతాల్లో క్రేన్లు ఏర్పాటు చేయాలన్నారు. పెద్ద చెరువుల దగ్గర గజ ఈతగాళ్లను ఏర్పాటు చేయాలని, మత్స్య శాఖ సహాయ సంచాలకులకు సూచించారు. నిమజ్జనం సజావుగా నిర్వహించుటకు తహసీల్దార్లు, ఎంపీడీవో, పోలీసు అధికారులతో కమిటీ ఏర్పాటు చేసుకొని కార్యాచరణ రూపొందించుకోవాల్సిందిగా వారు తెలిపారు. సమావేశంలో జడ్పీ సీఈ వో శైలేశ్, డీఆర్డీవో శ్రీనివాస్, డీపీవో తరుణ్కుమార్, ఆర్అండ్బీ ఈఈ శ్యాంసుందర్, విద్యుత్ శాఖ డీఈ కృష్ణారావు, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి పాల్గొన్నారు.