కోహీర్, అక్టోబర్ 18 : ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా ప్రవేశపెట్టి హరితహారాన్ని అటవీశాఖ దిగ్విజయంగా కొనసాగిస్తున్నది. మండలంలోని కోహీర్-కవేలి, కోహీర్-పోతిరెడ్డిపలి, కవేలి-ఏడాకులపల్లి గ్రామాల ప్రధాన రోడ్డుకు ఇరువైపులా హరితహారం ద్వారా మొక్కలు నాటారు. నాలుగు విడుతల్లో మూడు వేల మొక్కలను నాటి సంరక్షణకు చర్యలు తీసుకున్నారు. అటవీ శాఖ ద్వారా కార్మికులను నియమించి మొక్కలకు నీటిని పడుతున్నారు. వేసవిలోనూ నీటిని అందించడంతో మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి.
జాతీయ రహదారికి మొక్కలతో అందం..
మండలంలోని కోహీర్-కవేలి, కోహీర్-పోతిరెడ్డిపల్లి, కవేలి-ఏడాకులపల్లి గ్రామాల ప్రధాన రోడ్డు పక్కన అటవీశాఖ ఆధ్వర్యంలో నాటిన హరితహారం మొక్కలు ఏపుగా పెరుగుతున్నాయి. 65వ జాతీయ రహదారికి ఇరువైపులా మొక్కలను నాటేందుకు అటవీ శాఖ శ్రీకారం చుట్టింది. జాతీయ రహదారి పనులను చేపట్టిన ఎల్అండ్టీ సంస్థ రోడ్డు పక్కన ఒక వరుసలో మొక్కలను నాటినప్పటికీ అనుకున్నంతగా సఫలం కాలేదు. దీంతో హరితహారాన్ని విజయవంతంగా నిర్వహించాలని సంకల్పించిన ప్రభుత్వం అటవీ శాఖ అధికారులకు మొక్కలను నాటే బాధ్యతను అప్పగించింది. అటవీ శాఖ అధికారులు, సిబ్బంది కార్మికులతో కలిసి మొక్కలను నాటే పనుల్లో నిమగ్నమయ్యారు. డివైడర్పై పలు రకాల పూల మొక్కలను నాటడంతో ఆకర్షణీయంగా కనిపిస్తు న్నాయి. అటవీశాఖ ఆధ్వర్యంలో జాతీయ రహదారికి ఇరువైపులా మూడు వరుసల్లో మొక్కలను నాటుతున్నారు. కొత్తూర్ (డి), చింతల్ఘట్, వెంకటాపూర్, కవేలి, దిగ్వాల్, మద్రి గ్రామాల 65వ జాతీయ రహదారి పక్కన పలు రకాల మొక్కలను నాటి సంరక్షణ చర్యలు చేపడుతున్నారు. దీంతో వాహనదారులు, ప్రయాణికులకు ఆహ్లాదాన్ని పంచనున్నాయి. అటువైపు నుంచి వెళ్లే వారికి స్వచ్ఛమైన గాలి లభించనున్నది. హరితహారం నిర్వహణకు ప్రత్యేక శ్రద్ధ తీసుకున్న అటవీ శాఖ అధికారుల పనితీరుపై వాహనదారులు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
చాలా సంతృప్తి నిచ్చింది..
కోహీర్ మండలంలోని కొన్ని గ్రామాల ప్రధాన రోడ్డు పక్కన హరితహారం నాలుగో విడుతలో భాగంగా మూడు వేల మొక్కలను నాటాం. మొక్కల సంరక్షణకు కార్మికులను నియమించాం. ఎదుగుతున్న మొక్కలను చూస్తుంటే చాలా సంతృప్తి కలుగుతున్నది. 65వ జాతీయ రహదారి పక్కన కూడా మూడు వరుసల్లో మొక్కలను నాటి వందశాతం కాపాడుతాం.
-విజయారాణి, జహీరాబాద్ రేంజ్
అటవీ శాఖాధికారి మొక్కలను కాపాడినం..
అటవీ శాఖ ఆధ్వర్యంలో కవేలి నుంచి కోహీర్ ప్రధాన రోడ్డు పక్కన రెండు కిలోమీటర్ల వరకు రెండు దిక్కులా నాటిన మొక్కలను కాపాడినం. పెరుగుతున్న చెట్లను చూస్తుంటే చాలా సంతోషంగా ఉన్నది. హరితహారం ద్వారా మొక్కలు నాటాలని ఇంతమంచి పథకాన్ని తీసుకువచ్చిన సీఎం కేసీఆర్కు ధన్యవాదాలు.
-మొగులయ్య, కవేలి మాజీ సర్పంచ్