రామచంద్రాపురం, జూలై19 : తెలంగాణ రాష్ట్రం అన్నిరంగాల్లో ప్రగతిని సాధిస్తున్నదని శాసనమండలి ప్రొటెం చైర్మన్ వెన్నవరం భూపాల్రెడ్డి అన్నారు. సోమవారం భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీలో రూ.2.98కోట్లతో నిర్మించనున్న ‘మోడల్ రైతుబజార్’ నిర్మాణ పనులకు ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి ముఖ్యఅతిథులుగా హాజరై, కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డితో కలిసి శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ప్రొటెం చైర్మన్ మాట్లాడుతూ సమైక్యరాష్ట్రంలో గత పాలకుల నిర్లక్ష్యం కారణంగా పట్టణ ప్రాంత ప్రజలు ఎన్నో ఇబ్బందులు పడ్డారని తెలిపారు. రైతుబజార్ నిర్మాణానికి కృషి చేసిన మంత్రులు కేటీఆర్, హరీశ్రావులకు ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. భారతీనగర్ డివిజన్లోని ఎల్ఐజీలో అధునాతన సౌకర్యాలతో వెజ్ అండ్ నాన్వెజ్ మార్కెట్ని నిర్మించబోతున్నట్లు ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. రూ.2.98కోట్ల అంచనా వ్యయంతో మోడల్ రైతుబజార్ని ఏర్పాటు చేస్తున్నామన్నారు. విశాలమైన ప్రాంగణంలో నాలుగు షెడ్లతో 210 దుకాణాల సముదాయంతో కూడిన రైతుబజార్ను నిర్మిస్తున్నట్లు చెప్పారు. కార్పొరేటర్ సింధూఆదర్శ్రెడ్డి మాట్లాడుతూ మోడల్ రైతుబజార్ ఏర్పాటుతో రోడ్లపై వ్యాపారం చేసుకునే చిరు వ్యాపారులకు ఎంతో మేలు జరుగుతుందన్నారు. ఆర్సీపురం కార్పొరేటర్ పుష్పానగేశ్, జోనల్ కమిషనర్ రవికుమార్, ఉపకమిషనర్ బాల య్య, మాజీ కార్పొరేటర్ అంజయ్య, నాయకులు రాజేశ్వర్రెడ్డి, కుమార్గౌడ్, మోహన్రెడ్డి, జగన్నాథ్రెడ్డి, నర్సింహ, వినయ్కుమార్, దేవేంద్రాచారి, పరమేశ్ యాదవ్, కుత్బుద్దీన్, సత్యనారాయణ, ఐలేశ్ తదితరులు పాల్గొన్నారు.
సీఎంఆర్ఎఫ్ చెక్కులు అందజేత
భారతీనగర్ డివిజన్ పరిధిలోని బొంబాయికాలనీకి చెందిన గిరిబాబుకి రూ.60 వేలు, ఫెన్సింగ్ ఏరియాకు చెందిన రాఘవులుకి రూ.48 వేలు, శ్రీనివాస్కు రూ.28వేలు, అమీన్పూర్కి చెందిన బాలరాజుకి రూ.44వేలు, ఘనాపూర్కి చెందిన వర్శిణికి రూ.24వేలు సీఎంఆర్ఎఫ్ చెక్కులను ప్రొటెం చైర్మన్ భూపాల్రెడ్డి, ఎమ్మెల్యే మహిపాల్రెడ్డి అందజేశారు. భారతీనగర్, ఆర్సీపురం డివిజన్ల కార్పొరేటర్లు సింధూఆదర్శ్రెడ్డి, పుష్పానగేశ్ ఉన్నారు.