మెదక్, సెప్టెంబర్ 27: జిల్లాలో పర్యాటక రంగ అభివృద్ధికి ఎన్నో అవకాశాలున్నాయని, రాబోయే కాలంలో జిల్లాను పర్యాటక ఆకర్షణ ప్రాంతంగా తీర్చిదిద్దేందుకు ప్రణాళికలు రూపొందిస్తున్నామని మెదక్ స్థానిక సంస్థల అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ అన్నారు. ప్రపంచ పర్యాటక దినోత్సవం సందర్భంగా సోమవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్హాల్లో ఏర్పాటు చేసిన సమావేశంలో ఆమె మాట్లాడారు. ఆనందాన్ని, ఆహ్లాదాన్ని, విజ్ఞానాన్ని కలిగించే విధంగా పర్యాటక రంగాన్ని అభివృద్ధి చేయడంతో మన నాగరికత, సంస్కృతి, జీవనశైలి విధానాన్ని ముందుతరాలకు తెలియజేయవచ్చన్నారు. మెదక్ జిల్లాలో ఏడుపాయల, తునికిలో నల్లపోచమ్మ, మెదక్ చర్చి వంటి దర్శనీయ స్థలాలతో పాటు మెదక్ ఖిల్లా, నర్సాపూర్ అర్బన్ పార్కు, పోచారం అభయారణ్యం, జింకల ప్రత్యుత్పత్తి కేంద్రం, పార్కు వంటి ఎన్నో పర్యాటక ప్రాంతాలున్నాయని, వాటిని అభివృద్ధి చేసి పర్యాటకులను ఆకర్షించవచ్చన్నారు. హైదరాబాద్కు సమీపంలో ఉండడంతో పర్యాటకులు నర్సాపూర్ అర్బన్ పార్కును సందర్శిస్తున్నారని, జిల్లాలోని మిగతా పర్యాటక ప్రాంతాలు సందర్శించే విధంగా బస చేసేందుకు కాటేజీలు, క్యాటరింగ్, రవాణా వంటి అన్నివిధాల సౌకర్యాల కల్పన దిశగా ప్రణాళిక రూపొందిస్తున్నామన్నారు.
టూరిజం ప్యాకేజీకి ఏర్పాట్లు..
ఏడుపాయల ఆలయ ఈవోకు అవార్డు
పాపన్నపేట, సెప్టెంబర్ 27: ప్రసిద్ధ పుణ్యక్షేత్రమైన ఏడుపాయల వనదుర్గాదేవి క్షేత్రం పర్యాటక కేంద్రంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్న ఏడుపాయల ఈవో సారా శ్రీనివాస్కు అవార్డు లభించింది. సోమవారం పర్యాటక దినోత్సవాన్ని పురస్కరించుకుని ఏడుపాయల ప్రాంతం ఆధ్యాత్మికంగా, పర్యాటకంగా అభివృద్ధి చెందడానికి కృషి చేస్తున్నందుకు గానూ మెదక్ అదనపు కలెక్టర్ ప్రతిమాసింగ్ కలెక్టర్ కార్యాలయంలో అవార్డు అందజేశారు.