సిద్దిపేట, జూలై 23 : సిద్దిపేట జిల్లాలో రెండు రోజులుగా ఓ మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిశాయి. శుక్రవారం రోజు జిల్లాలో వర్షం కొంత తెరిపినిచ్చింది. వాగులు పొంగి పొర్లాయి. చెరువులు చెక్డ్యాంలు మత్తళ్లు పోశాయి. జిల్లాలో సరాసరిగా 5.1సెంటీమీటర్ల వర్షపాతం నమోదైనట్లు అధికారులు తెలిపారు. అత్యధికంగా కొమురవెల్లి, కొండపాక మండలాల్లో 7.2 సెం. మీ వర్షం కురిసింది, మండలాల వారీగా దుబ్బాకలో 6.4సెం.మీ, సిద్దిపేట రూరల్ మండలంలో 4.6 సెం.మీ, చిన్న కోడూర్లో 6.2సెం.మీ, బెజ్జంకిలో 3.6సెం.మీ, కోహెడలో 4.3సెం.మీ, హుస్నాబాద్లో 5.9సెం.మీ, అక్కన్నపేటలో 5.9 సెం.మీ, నంగునూర్లో 2.8 సెం.మీ, సిద్దిపేట అర్బన్లో 4.6 సెం.మీ, తొగుటలో 5.4 సెం.మీ, మిరుదొడ్డిలో 6.2సెం.మీ, దౌల్తాబాద్లో 5.7సెం.మీ, రాయపోల్లో 5.7సెం.మీ, వర్గల్లో 3.2 సెం.మీ, ములుగులో1.7 సెం. మీ, మర్కూక్లో 1.7 సెం.మీ, జగదేవ్పూర్లో 4.6 సెం.మీ, గజ్వేల్లో 3.1 సెం.మీ, చేర్యాలలో 6.8 సెం.మీ, మద్దూర్లో 6.8 సెం.మీ, ధూళిమిట్టలో 6.8 సెం.మీ, నారాయణరావుపేటలో 4.6 సెం. మీటర్ల వర్షం కురిసింది.
మెదక్ జిల్లాలో సరాసరి 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు..
మెదక్ జిల్లాలో మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ఘనపూర్ ప్రాజె క్టు, పోచారం ప్రాజెక్టులు పూరిస్థాయిలో నిండి అలుగు పారడానికి సిద్ధంగా ఉన్నాయి. గురువారం ఉదయం నుంచి శుక్రవారం మధ్యాహ్నం వరకు జిల్లాలో వర్షం కురిసింది. జిల్లాలో 2516 చెరువులు ఉండగా, 163 చెరువులు నిండాయి. 77 చెరువులు అలుగు పారుతున్నాయి. వంద ఎకరాలకుపైగా ఆయకట్టు ఉన్న చెరువులు 268 ఉండగా, వంద ఎకరాల్లోపు ఆయకట్టు ఉన్న చెరువులు 2,248 ఉన్నాయి. జిల్లాలో హల్దీవాగుపై 32 చెక్డ్యాంలు, మంజీర నదిపై రెండు చెక్డ్యాంలు జలకళను సంతరించుకున్నాయి. మెదక్ జిల్లాలో సరాసరి 3 సెంటీ మీటర్ల వర్షపాతం నమోదు కాగా, అత్యధికంగా నార్సింగి మండలంలో 7.4 సెంటీమీటర్ల వర్షం కురిసిందని వాతావరణ శాఖ అధికారులు వెల్లడించారు. చిన్నశంకరంపేటలో 4.1 సె.మీ, నిజాంపేటలో 7.3 సె.మీ, రామాయంపేట, హవేళీఘనపూర్లో 3.7 సె.మీ, తూప్రాన్లో 2.9సె.మీ, మెదక్ 3.5సె.మీ, కొల్చారం మండలాల్లో 2 సె.మీ, శివ్వంపేటలో 2.7 సె.మీ, మాసాయిటలో 2.9 సె.మీ, నర్సాపూర్లో 2.1 సె.మీ, కౌడిపల్లిలో 2 సె.మీ, టేక్మాల్లో 1.5సె.మీ, మనోహరాబాద్లో 1.9 సె.మీ, చిలిపిచెడ్లో 1.3 సె.మీ వర్షం కురిసింది.
సంగారెడ్డి జిల్లాలో తేలికపాటి వర్షాలు..
సంగారెడ్డి జిల్లాలో వర్షాలు తగ్గుముఖం పట్టాయి. నాలుగైదు రోజులుగా ఎడతెరపి లేకుండా కురిసిన వర్షాలు శుక్రవారం తెరిపినిచ్చాయి. జిల్లాలో శుక్రవారం ఉదయం నుంచి సాయంత్రం వరకు తేలికపాటి వర్షాలు కురిశాయి. వర్షం తెరిపినివ్వటంతో జనజీవనం సాధారణ స్థితికి వచ్చింది. రైతులు వ్యవసాయ పనుల్లో నిమగ్నమయ్యారు. పంటపొలాల్లో వర్షం నీరు నిలవడంతో కాల్వల ద్వారా నీటిని బయటకు పంపించే పనులు చేపట్టారు. శుక్రవారం జిల్లా అంతటా 32.9 సెంటీ మీటర్ల వర్షం కురవగా, జిల్లా సరాసరి వర్షపాతం 1.2 సెంటీ మీటర్లుగా నమోదైంది. గుమ్మడిదలలో అత్యధికంగా 2.7 సెం.మీటర్ల వర్షం కురిసింది. జిల్లాలో సాధారణ వర్షపాతం కంటే 47 శాతం అదనంగా వర్షం కురిసింది. జిల్లాలోని 8 మండలాల్లో 59 శాతం అధిక వర్షం కురవగా, 12 మండలాల్లో 20 నుంచి 59 శాతం వర్షం నమోదైంది.
ఏడు మండలాల్లో సాధారణ వర్షం కురిసింది. జిన్నారం మండలంలో 1.9 సెం.మీటర్లు, పటాన్చెరులో 1.8 సెం.మీటర్లు, రామచంద్రాపురం, కంగ్టిలో 1.7, కల్హేర్లో 1.6 సెం.మీటర్ల వర్షపాతం నమోదైంది. మిగతా మండలాల్లో 1.2 నుంచి 1.5 సెం.మీటర్లలోపు వర్షపాతం నమోదైంది. ప్రాజెక్టులు, చెరువుల్లోకి వరద వస్తున్నది. సింగూరు ప్రాజెకు జలకళ సంతరించుకోగా, నల్లవాగు ప్రాజెక్టు అలుగు పారుతున్నది. జహీరాబాద్లోని నారింజ ప్రాజెక్టు నిండి కర్ణాటకలోని కరంజా ప్రాజెక్టులోకి వరద వెళ్తున్నది. జహీరాబాద్, నారాయణఖేడ్, అందోల్ నియోజకవర్గాల్లో పలు చెరువులు అలుగు పారుతున్నాయి. వ్యవసాయశాఖ పంటనష్టం వివరాలు సేకరించేందుకు సిద్ధవుతున్నది. వర్షాలు సమృద్ధ్దిగా కురవడంతో సాధారణ విస్తీర్ణం కంటే ఎక్కువ సాగైంది. పెసర, మినుము, కంది, పత్తి పంటలు నీటమునిగాయి.