పల్లెప్రగతితో మారిన మునిపల్లి రూపురేఖలు
పారిశుధ్య నిర్వహణతో స్వచ్ఛ వీధులు
ఆకట్టుకున్న పల్లెప్రకృతి వనం, నర్సరీ
రోడ్డుకిరువైపులా హరితహారం మొక్కలు
మునిపల్లి, జూలై 30 : పల్లెలు ఆదర్శ గ్రామాలుగా రూపుదిద్దుకోవాలనే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా పల్లెప్రగతి కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. పల్లెప్రగతితో మండల కేంద్రమైన మునిపల్లి పంచాయతీ రూపురేఖలే మారిపోయాయి. మునిపల్లి పాలకవర్గం ప్రభుత్వం మంజూరు చేస్తున్న నిధులను సద్వినియోగం చేసుకుంటూ అభివృద్ధిలో దూసుకుపోతున్నారు. గ్రామంలో విస్తృతంగా పరిశుభ్రత, పచ్చదనం కార్యక్రమాలను నిర్వహిస్తున్నారు. గ్రామంలో అడుగుపెట్టగానే మునిపల్లి చౌరస్తా నుంచి రోడ్డుకిరువైపులా హరితహారం మొక్కలు పచ్చదనంతో స్వాగతం పలుకుతున్నాయి. ప్రతి వీధిలో సీసీరోడ్లు, అండర్ డ్రైనేజీలు నిర్మించడంతో గ్రామం ఎంతో చూడముచ్చటగా కనిపిస్తున్నది. పల్లెప్రకృతి వనం, నర్సరీ, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, రైతువేదిక నిర్మాణాలు గ్రామానికి అందాన్ని తెచ్చిపెట్టాయి. ప్రతి ఇంటికీ మరుగుదొడ్డి, ఇంకుడుగుంతలతో గ్రామం పరిశుభ్రంగా మారింది. మునిపల్లిలో 3,393 మంది జనాభా ఉండగా, 813 కుటుంబాలు ఉన్నాయి. మునిపల్లిలో నివసిస్తున్న ప్రజలు వందశాతం ఇంటి పన్ను చెల్లిస్తూ గ్రామ అభివృద్ధిలో పాలు పంచుకుంటున్నారు. దీంతో మునిపల్లి ఆదర్శ మండల కేంద్రం దిశగా పరుగులు పెడుతున్నది.
పల్లెప్రగతితో అభివృద్ధి..
పల్లెప్రగతిలో భాగంగా మునిపల్లి అన్ని రంగాల్లో అభివృద్ధిలో దూసుకుపోతున్నది. రూ.13లక్షలతో వైకుంఠధామం, రూ.2లక్షలతో డంపింగ్యార్డు, రూ.22లక్షలతో రైతువేదిక, నర్సరీ, పల్లెప్రకృతి వనం, రైతుల కోసం కల్లాలు నిర్మించారు. పంచాయతీ నిధులతో కొనుగోలు చేసిన ట్రాక్టర్తో గ్రామంలో పారిశుధ్య కార్మికులు ప్రతి రోజు ఇంటింటికీ వెళ్లి చెత్తను సేకరించి డంపింగ్యార్డుకు తరలిస్తున్నారు. గ్రామంలోని ప్రధాన వీధుల్లో ఎల్ఈడీ బల్బులు ఏర్పాటు చేసి గ్రామానికి కొత్త వెలుగులు తీసుకొచ్చారు.
పల్లెప్రకృతి వనం, నర్సరీ ఏర్పాటు..
మునిపల్లిలో ఏర్పాటు చేసిన పల్లెప్రకృతి వనంలో 1500 మొక్కలను నాటి వాటిని సంరక్షిస్తున్నారు. నర్సరీలో టేకు, తులసి, జామ, టైకోమా, జీడీ, నిమ్మ, ఖర్జూర, ఉసిరి తదితర మొక్కలు నాటారు.
రైతువేదిక..
గ్రామంలో రైతుల తమ సమస్యలను పరిష్కరించుకునేందుకు ప్రభుత్వం మంజూరు రూ.22లక్షలతో రైతువేదికను నిర్మించుకున్నారు. ఇందులో మండల వ్యవసాయ శాఖ అధికారులు అందుబాటులో ఉండేలా ప్రత్యేక గదులను నిర్మించారు. మునిపల్లి మండల పరిధిలోని గ్రామాల ప్రజలకు రైతువేదిక ఎంతో ఉపయోగపడుతుంది. ఆయా గ్రామాలకు సంబంధించిన రైతులు సమావేశాలు ఏర్పాటు చేసి తమ సమస్యలు, సలహాలు సూచనలను వ్యవసాయశాఖ అధికారులను అడిగి తెలుసుకుంటున్నారు.