గజ్వేల్, జూలై18: ఆషాఢమాసాన్ని పురస్కరించుకొని గజ్వేల్ మహంకాళి అమ్మవారికి పట్టణ ప్రజలు ఆదివారం బోనాలు సమర్పించారు. మూడు రోజులుగా కొనసాగుతున్న గజ్వేల్ మహంకాళి అమ్మవారి బోనాల ఉత్సవాలు ఆదివారం ముగిసాయి. ఆదివారం ఉదయం పాతబస్తీ, పటేల్ బజార్ నుంచి ఊరేగింపుగా మహిళలు బోనాలతో తరలివచ్చారు. మహంకాళి అమ్మవారితో పాటు గ్రామదేవతలు పోచమ్మ, రేణుక ఎల్లమ్మ ఆలయాల్లో బోనాలను సమర్పించారు. గజ్వేల్-ప్రజ్ఞాపూర్ మున్సిపల్ చైర్మన్ ఎన్సీ రాజమౌళి, గజ్వేల్ మహంకాళి ఆలయ కమిటీ చైర్మన్ కాల్వ శ్రీధర్రావు ఆధ్వర్యంలో బోనాల ఉత్సవాలకు ఏర్పాట్లు చేశారు. కరోనా దృష్ట్యా ఉదయం నుంచే మహిళలు ఎవరికి వారు తమ ఇండ్ల నుంచి బోనాలను తీసుకువచ్చి అమ్మవార్లకు సమర్పించారు. టీఆర్ఎస్ పట్టణాధ్యక్షుడు గోపాల్రెడ్డి ఆధ్వర్యంలో 20వ వార్డు నుంచి మహిళలు పెద్ద ఎత్తున బోనాలతో ఊరేగింపుగా తరలివచ్చి అమ్మవారికి సమర్పించి మొక్కులు తీర్చుకున్నారు. మహిళలు, భక్తులు ప్రభుత్వ సూచనలు పాటిస్తూ మాస్కులు ధరించి బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. ఆలయ ప్రధానార్చకులు చాడ నందబాలశర్మ ఆధ్వర్యంలో అమ్మవారికి ప్రత్యేక అభిషేకాలు, అలంకరణ పూజా కార్యక్రమాలు నిర్వహించారు. భక్తుల రద్దీతో నూతన ఆలయం ఎదుట ఉన్న పోత లింగన్న వద్దే పలువురు మహిళలు బోనాలను సమర్పించారు.
తెలంగాణ అంటేనేబోనం : ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి
ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి ఆదివారం బోనాల ఉత్సవాల్లో పాల్గొన్నారు. మున్సిపల్ చైర్మన్ రాజమౌళి, ఎంపీపీ అమరావతి, సీనియర్ నాయకులు డాక్టర్ యాదవరెడ్డి, కౌన్సిలర్లు ఉప్పలమెట్టయ్య, గోపాల్రెడ్డి, బాలమణి, రహీం, సంధ్యారాణి శ్రీధర్, లక్ష్మీకిషన్రెడ్డి, శిరీషరాజు, బొగ్గుల చందు తదితరులు ఆయనకు స్వాగతం పలికారు. కోటమైసమ్మ ఆలయంలో అమ్మవారికి ప్రత్యేక పూజలు నిర్వహించి ఆలయం వద్ద నుంచి గజ్వేల్ మహంకాళి ఆలయానికి ఫలహారం బండికట్టారు. ఈ సందర్భంగా ఎఫ్డీసీ చైర్మన్ వంటేరు ప్రతాప్రెడ్డి మాట్లాడుతూ.. అమ్మవారిని ఆషాఢమాసం తల్లిగారింటికి పంపినట్టుగా ప్రజలు భావించి అమ్మవారికి బోనం సమర్పిస్తారన్నారు. ప్రకృతిని పూజించే వేడుకల్లో ఆషాఢ మాసం బోనాలు ఒకటని, తెలంగాణ అంటేనే బోనమని, టీడీపీ,కాంగ్రెస్ ప్రభుత్వాలు బోనాల పండుగను నిర్లక్ష్యం చేశాయని, తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావంతో బోనాల ఉత్సవాలను ప్రభుత్వం ఘనంగా నిర్వహిస్తున్నదన్నారు.