అందోల్, ఆగస్టు 4: అందోల్-జోగిపేట మున్సిపల్ పరిధిలోని ప్లాస్టిక్ దుకాణాల ముసుగులో అక్రమ దందా జోరుగా సాగుతున్నది. ప్లాస్టిక్ బాటిళ్లు, కాగితాలు, అట్టముక్కలు ఇతరత్రా సా మాన్ల కొనుగోలు కోసం దుకాణాలు ఏర్పాటుచేసి చాటుమాటుగా అక్రమ వ్యాపారాలకు తెరలేపుతున్నారు కొందరు వ్యాపారులు. ప్లాస్టిక్ సామాన్లతో పాటు పశువుల కళేబరాలు, తోల్లు ఇతరత్రా వస్తువుల వ్యాపారాలు సాగిస్తున్న దందాపై అధికారులు దృష్టిపెట్టి మూడు దుకాణాలు సీజ్ చేశారు. అక్రమ దందాకు అడ్డూ అదుపు లేకుండా పోవడంతో ఈ ప్రాంతం మొత్తం దుర్గంధం వ్యాపిస్తుండడంతో ప్రజలు అనారోగ్యాల బారిన పడుతున్నారు. మున్సిపల్ పరిధిలోని 6వ వార్డులో మూడు ప్లాస్టిక్ దుకాణాలను మున్సిపల్ అధికారులు సీజ్చేశారు. ఈ సందర్భంగా కమిషనర్ నిర్మల మాట్లాడుతూ అందోల్లోని ప్లాస్టిక్ దుకాణాల్లో వివిధ జంతువుల వ్యర్థాలు, ఇతరత్రా వస్తువులు నిల్వ చేస్తుండడంతో దుర్గంధం వ్యాపిస్తూ ఇబ్బందులు పడుతున్నట్లు కాలనీవాసులు ఫిర్యాదు చేశారన్నారు. సంబంధిత దుకాణాల వారికి నోటీసులు అందజేయగా స్పందించకపోవడంతో బుధవారం దుకాణాలు తనిఖీచేయగా జంతువుల కళేబరాలు, తోల్లు లభించినట్లు తెలిపారు. దీంతో దుకాణాలను సీజ్చేశామన్నారు. ఇకపై మున్సిపల్ పరిధిలో తనిఖీలు నిర్వహించి ఇలాంటి వ్యాపారాలు కొనసాగకుండా చూస్తామన్నారు. కార్యక్రమంలో మున్సిపల్ వైస్ చైర్మన్ ప్రవీణ్, శానిటర్ ఇన్స్పెక్టర్ వినయ్, సిబ్బంది పాల్గొన్నారు.