మనోహరాబాద్, అక్టోబర్ 25 : మండలంలోని కూచారం పారిశ్రామికవాడలో ఎస్వీ ఇన్సినేటర్స్ లిమిటెడ్ పేరిట నూతనంగా పరిశ్రమను ఏర్పాటు చేయనున్నారు. పర్యావరణ పరిరక్షణ, పరిశ్రమ ఏర్పాటుపై అభ్యంతరాలు తెలియజేసేందుకు సమీప గ్రామాలైన డిల్లాయి, కూచారం, జీడిపల్లి గ్రామస్తులతో సోమవారం ప్రజాభిప్రాయ సేకరణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా పరిశ్రమ నిర్వాహకులు మాట్లాడుతూ దవాఖానలు, పరిశ్రమల్లో వృథాగా పారవేసిన వ్యర్థాలను అత్యాధునిక టెక్నాలజీతో రిసైక్లింగ్ చేసే ప్రాసెసింగ్ యూనిట్ను ఏర్పాటు చేయనున్నట్లు తెలిపారు. దీనిపై ప్రజలు, పర్యావరణ హక్కుల నేతలు తమ అభిప్రాయాలు తెలియజేయాలని కోరారు. కూచారం పారిశ్రామిక వాడల్లో నూతనంగా ఏర్పాటు చేయబోయే పరిశ్రమల్లో స్థానికులకు ఉద్యోగాలు కల్పించాలని గ్రామస్తులు కోరారు. ఇదివరకు పారిశ్రామిక వాడ కోసం 800 ఎకరాల స్థలాన్ని అప్పటి ప్రభుత్వం రైతుల వద్ద నుంచి తీసుకొని బాధితులకు పట్టాలు ఇచ్చి స్థలాన్ని చూపలేదని గ్రామస్తులు అన్నారు. అనంతరం మెదక్ అదనపు కలెక్టర్ రమేశ్ మాట్లాడుతూ ప్రజల నుంచి స్వీకరించిన అభిప్రాయాలను పరిశీలించి ఉన్నతాధికారులకు నివేదిక అందజేస్తామన్నారు. కార్యక్రమంలో పీసీబీ ఈఈ రవికుమార్, టీఎస్ఐఐసీ జోనల్ మేనేజర్ మాధవి, ఐలా కమిషనర్ కేటీ నాయ క్, తహసీల్దార్ భిక్షపతి, ఎంపీవో ఉదయ్శంకర్, సర్పంచ్ నరేందర్, గ్రామస్తులు పాల్గొన్నారు.