మెదక్, జూలై 23 : జిల్లాలో జాతీయ, రాష్ట్ర, గ్రామీణ రహదారులతో పాటు మున్సిపల్ ప్రాంతాల్లో ఎక్కువగా ప్రమాదాలు జరుగుతున్నట్టు గుర్తించిన బ్లాక్స్పాట్ ప్రాంతాల్లో స్పీడ్ బ్రేకర్లు, స్ట్టాడ్స్, బ్లింకర్లైట్లు, కల్వర్టుల వద్ద, అండర్ పాస్ల వద్ద రేడియం స్టిక్కర్లు, టీఎండ్ గల రోడ్ ప్రాంతాల్లో సైన్ బోర్డులు పెట్టాలని కలెక్టర్ హరీశ్ అధికారులకు సూచించారు. శుక్రవారం కలెక్టరేట్లోని వీడియో కాన్ఫరెన్స్ హాలులో నిర్వహించిన రోడ్డు భద్రత కమిటీ సమావేశంలో ఆయన మాట్లాడారు. ప్రధానంగా జంక్షన్లు, యూటర్న్లు, పాదచారులు రోడ్డు దాటేటప్పుడు, వేగంగా వెళ్లడం, రాంగ్ సైడ్లో డ్రైవ్ చేయడం, చిన్న, పెద్ద రోడ్డు కలిసే ప్రాంతాలు, వెలుతురు సరిగా లేని ప్రాంతాల్లో ప్రమాదాలు ఎక్కువగా జరుగుతున్నట్లు గుర్తించామన్నారు. ప్రమాదంలో మృతి చెందిన సంఖ్యను బట్టి ఏబీసీ అని మూడు క్యాటగిరీలుగా బ్లాక్ స్పాట్లను గుర్తించామని, అందుకనుగుణంగా అధికారులు ప్రమాదాల నివారణకు చర్యలు తీసుకోవాలన్నారు.
జాతీయ రహదారుల వెంట రోడ్డు క్రాస్ చేయుటకు పాదచారులకు ఏర్పాటు చేసిన జీబ్రా క్రాస్ లైన్లను వదిలి ఎక్కడపడితే అక్కడ గ్రిల్స్ను తొలగించి అడ్డదారిగా రోడ్డు దాటుతున్నారని, ఇది చాలా ప్రమాదకరమని ప్రజల్లో చైత న్యం కలిగిస్తూ తొలగించిన గ్రిల్స్ను సరిచేయాలని జాతీయ ప్రాధికార సంస్థ ఇంజినీరింగ్ అధికారులకు సూచించారు. జిల్లాలో రామాయంపేట, తూప్రాన్, నర్సాపూర్ వంటి ప్రధాన రహదారుల్లో రోడ్డు ప్రమాదాల సంఖ్య ఎక్కువగా ఉంటున్నందున, రోడ్డు భద్రతా మార్గదర్శకాలకనుగుణంగా అన్ని చర్యలు తీసుకోవాలని సూచించారు.
రోడ్డు ప్యాచ్ వర్క్లు ఎప్పటికప్పుడు చేపట్టాలి..
రోడ్డు ప్యాచ్ వర్క్లు ఎప్పటికప్పుడు చేపట్టాలని కలెక్టర్ హరీశ్ తెలిపారు. అవసరమైన ప్రాంతాల వద్ద అండర్ పాస్ రోడ్డు నిర్మించాలని, బైపాస్ రోడ్ నుంచి ప్రధాన రహదారి పైకి వచ్చే మార్గం సమాంతరంగా ఉండేలా చూడాలని, అత్యవసర సమయంలో వాహనాలు రహదారి పక్కన ఆపడానికి తగు ఏర్పాటు చేయాలని తెలిపారు. మెదక్, నర్సాపూర్ నుంచి హైదరాబాద్ వెళ్లే రహదారిలో చాలా మంది వాహనదారులు కోతులకు తినుబండారాలు ప్లాస్టిక్ కవర్లో అందిస్తూ రోడ్లపై వాహనాలు నిలుపడంతో ప్రమాదాలకు కారకులవుతున్నారని అన్నారు. పోలీసు, అటవీ, ఆర్టీవో, జాతీయ, రాష్ట్ర రహదారుల అధికారులు అలాంటి వారిని గుర్తించి వైల్డ్ లైఫ్, జాతీయ రోడ్డు భద్రత, వయోలెన్స్ వంటి కేసులు నమోదు చేయాలన్నారు.
రూ.కోట్ల వ్యయంతో నిర్మించిన రోడ్డులో కేజీవీల్స్ నడపడం ద్వారా పాడవుతున్నాయని, ఎన్హెచ్ వాళ్లు పెట్రోలింగ్లో ఇటువంటి వాహనాలు కనిపిస్తే దగ్గరలోని పోలీసు స్టేషన్లకు తెలియజేయాలని సూచించారు. సమావేశంలో అదనపు కలెక్టర్లు ప్రతిమాసింగ్, రమేశ్, డీఎఫ్వో జ్ఞానేశ్వర్, డీఎస్పీలు కృష్ణమూర్తి, కిరణ్కుమార్, జిల్లా రవాణా అధికారి శ్రీనివాస్గౌడ్, డీఎంహెచ్వో వెంకటేశ్వర్రావు, ఆర్అండ్బీ ఈఈ శ్యామ్సుందర్, పంచాయతీరాజ్ ఈఈ రాంచంద్రారెడ్డి, ఎన్హెచ్ అధికారులు, ఆర్డీవో సాయిరాం, మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తదితరులు పాల్గొన్నారు.