గుమ్మడిదల/పటాన్చెరు, జూలై 22: సీఎం కేసీఆర్ పేదలకు వెన్నంటి ఉంటూ వారి శ్రేయస్సుకు కృషి చేస్తున్నారని ఎమ్మెల్యే గూడెం మహిపాల్రెడ్డి అన్నారు. గురువారం పటాన్చెరులో ఎమ్మెల్యే క్యాంప్ ఆఫీస్లో నియోజకవర్గంలోని గుమ్మడిదల, జిన్నారం, పటాన్చెరు, అమీన్పూర్, రామచంద్రాపురం మండలాలకు చెందిన ఐదుగురు దివ్యాంగులకు రూ. 50 వేల చొప్పున పునరావాస పథకం కింద ఎమ్మెల్యే చెక్కులను పంపిణీ చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఆర్థిక పునరావాస పథకం ద్వారా ఎంపికైన లబ్ధిదారులకు వంద శాతం సబ్సిడీతో ఆర్థిక సాయాన్ని అందిస్తామన్నారు. లబ్ధిదారులు సర్కారు అందించిన సహాయంతో జీవన ప్రమాణాలను పెంపొందించుకోవాలని కోరారు. కార్యక్రమంలో జడ్పీ వైస్ చైర్మన్ ప్రభాకర్, ఎంపీపీలు దేవానందం, రవీందర్గౌడ్, జడ్పీటీసీలు కుమార్గౌడ్, సుధాకర్రెడ్డి, ఎంపీడీవో చంద్రశేఖర్, ఆయా గ్రామాల సర్పంచ్లు, ఎంపీటీసీలు, అంగన్వాడీ అధికారులు, టీఆర్ఎస్ సీనియర్ నాయకులు జీ.వెంకటేశ్గౌడ్, వెంకట్రెడ్డి, దశరథ్రెడ్డి, వెంకటేశ్, విజయ్భాస్కర్రెడ్డి, ప్రమోద్గౌడ్, సురేందర్గౌడ్ తదితరులు పాల్గొన్నారు.