మెదక్, సెప్టెంబర్ 13: ‘టీఆర్ఎస్ పార్టీకి కార్యకర్తలే పట్టుకొమ్మలు. 2001లో స్థాపించి సీఎం కేసీఆర్ గులాబీ జెండాను చేతపట్టుకొని యావత్తు తెలంగాణను ఏకం చేశారు. ఢిల్లీ నాయకుల మెడలు వంచి, చావునోట్లో తలపెట్టి సాధించిన తెలంగాణను అన్నిరంగాల్లో అభివృద్ధి చేయాలనే ఉద్దేశంతో కృషి చేస్తున్నారు.’ అని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి అన్నారు. సోమవారం జిల్లా కేంద్రంలోని వెంకటేశ్వర గార్డెన్స్లో మెదక్ పట్ట ణం, మెదక్, హవేళీఘనపూర్ మండలాల టీఆర్ఎస్ పార్టీ కార్యకర్తల విస్తృతస్థాయి సమావేశాన్ని ఏర్పాటు చేశారు. సమావేశానికి ఆమె ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడుతూ టీఆర్ఎస్ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయనున్నట్లు చెప్పా రు. మెదక్ నియోజకవర్గంలో అన్ని గ్రామాల్లో కమిటీలు వేయాలన్నారు. ఈ నెల 20వ తేదీలోగా కమిటీలను పూర్తిచేస్తామని తెలిపారు. కరోనా సంక్షోభంలో కూడా ప్రభుత్వం అన్ని పథకాలను ముందుకు తీసుకెళ్లిందన్నారు. 60 ఏండ్ల కాంగ్రెస్ పాలనలో ప్రజలకు చేసిందేమి లేదని ఎమ్మెల్యే ఆరోపించారు. రైతులను ఇబ్బందులు పెట్టిన ఘనత కాంగ్రెస్ పార్టీదేనని ఎద్దేవా చేశారు. టీఆర్ఎస్ ప్రభు త్వం ఏర్పడిన తర్వాత రైతు సంక్షేమం కోసం అనేక పథకాలను ప్రవేశపెట్టారని గుర్తుచేశారు. బీజేపీ ప్రభుత్వం ప్రజల నడ్డివిరుస్తుందని విరుచుకుపడ్డారు. పెట్రోల్, డీజిల్ ధరలను పెంచిన ఘనత మోడీ ప్రభుత్వానికే దక్కిందన్నారు. సమావేశంలో టీఆర్ఎస్ రాష్ట్ర నాయకుడు, ఇఫ్కో డైరెక్టర్ దేవేందర్రెడ్డి, జడ్పీ వైస్ చైర్మన్ లావణ్యరెడ్డి, మున్సిపల్ చైర్మన్ చంద్రపాల్, వైస్ చైర్మన్ మల్లికార్జున్గౌడ్, పీఏసీఎస్ చైర్మన్ హన్మంతరెడ్డి, మార్కెట్ కమిటీ మాజీ చైర్మన్ ఆకిరెడ్డి కృష్ణారెడ్డి, టీఆర్ఎస్ పట్టణ అధ్యక్షుడు గంగాధర్, మెదక్ మండల అధ్యక్షుడు అంజాగౌడ్, హవేళీఘనపూర్ మండల అధ్యక్షుడు శ్రీనివాస్రెడ్డి, రైతు సమన్వయ సమితి మెదక్ మండల అధ్యక్షుడు కిష్టయ్య, టీఆర్ఎస్ నాయకులు లింగారెడ్డి, చింతల నర్సింహులు, సుభాష్రెడ్డి, మెదక్, మెదక్ మండలం, హవేళీఘనపూర్ మండలాలకు చెందిన సర్పంచులు, ఎంపీటీసీలు, మున్సిపల్ కౌన్సిలర్లు, టీఆర్ఎస్ ముఖ్య నాయకులు, కార్యకర్తలు పెద్దఎత్తున పాల్గొన్నారు.