సంగారెడ్డి కలెక్టరేట్, సెప్టెంబర్ 13 : జిల్లాలో నూతనంగా నిర్మించిన సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియం త్వరలో ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు చేతుల మీదుగా ప్రారంభించనున్నట్టు సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు వెల్లడించారు. సోమవారం అదనపు కలెక్టర్ రాజర్షి షాతో కలిసి జిల్లా సైన్స్ కేంద్రాన్ని కలెక్టర్ సందర్శించారు. మ్యూజియం ఏర్పాట్లపై జిల్లా సైన్స్ అధికారి విజయ కుమార్ను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ తెలంగాణ ఏర్పడిన తర్వాత రాష్ట్రంలోనే జిల్లాలో మొదటిసారి సర్ సీవీ రామన్ సైన్స్ మ్యూజియం నిర్మించడం సంతోషంగా ఉందన్నారు. కలెక్టర్ వెంట జడ్పీ సీఈవో ఎల్లయ్య, డీఆర్డీవో శ్రీనివాసరావు, జిల్లా సైన్స్ అధికారి విజయ్ కుమార్, డీసీఈబీ సెక్రటరీ లింబాజీ, ఆర్అండ్బీ అధికారులు ఉన్నారు.
తాత్కాలిక వైద్య కళాశాలగా డీఎంహెచ్వో భవనం
రాష్ట్ర ప్రభుత్వం సంగారెడ్డికి వైద్య కళాశాలను మంజూరు చేయడంతో పాటు ఈ ఏడాది నుంచి తరగతులు నిర్వహించాలన్న ప్రభుత్వ ఆదేశాల మేరకు పనులు చకచకా కొనసాగుతున్నాయి. తాత్కాలికంగా వైద్య కళాశాల నిర్వహణ కోసం జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ అధికారి కార్యాలయాన్ని కేటాయించారు. దీంతో కార్యాలయాన్ని వేగంగా షిఫ్ట్ చేసేందుకు ఏర్పాట్లు జరుగుతున్నాయి. జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన ప్రాంగణంలో గల మెడికల్ స్టాఫ్ క్వార్టర్స్లోకి డీఏంహెచ్వో కార్యాలయాన్ని షిఫ్ట్ చేయనున్న నేపథ్యంలో అందుకు సం బంధించిన మరమ్మతుల పురోగతిని కలెక్టర్ సోమవారం పరిశీలించారు. ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ వైద్య సిబ్బంది క్వార్టర్స్ మరమ్మతులను వేగంగా పూర్తిచేసి డీఏంహెచ్వో కార్యాలయాన్ని షిఫ్ట్ చేయనున్నట్టు పేర్కొన్నారు. సంబంధిత మూడు భవనాల మరమ్మతులను వారంలో పూర్తి చేసి అందజేయాలని అధికారులకు సూచించారు. మెడికల్ కళాశాల నిర్మాణానికి సంబంధించిన పురోగతిపై ఆరా తీశారు. అనంతరం వెల్నెస్ సెంటర్ దగ్గరలో ఏర్పాటు చేసిన నూతన పీఎస్ఏ ఆక్సిజన్ ప్లాంట్ను కలెక్టర్ తనిఖీ చేశారు. కొత్త ఆక్సిజన్ ప్లాంట్ ద్వారా నిమిషానికి వెయ్యి లీటర్ల ఆక్సిజన్ ఉత్పత్తి అవుతుందని జిల్లా కేంద్ర ప్రభుత్వ దవాఖాన సూపరింటెండెంట్ డాక్టర్ సంగారెడ్డి కలెక్టర్కు వివరించారు. అన్ని ఏర్పాట్లు పూర్తయినందున త్వరలోనే అందుబాటులోకి వస్తుందని తెలిపారు.
ఈజీఎస్ లక్ష్యాన్ని 15 రోజుల్లో పూర్తి చేయాలి
15 రోజుల్లో ఈజీఎస్ లక్ష్యాన్ని పూర్తి చేయాలని సంగారెడ్డి కలెక్టర్ హనుమంతరావు స్పష్టం చేశారు. జిల్లా గ్రామీణ అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో సోమవా రం స్థానిక పాత డీఆర్డీఏ కార్యాలయంలో ఏపీవోలు, ఈసీలు, టెక్నికల్ అసిస్టెంట్లకు జల శక్తి అభియాన్పై సమీక్ష, శిక్షణా కార్యక్రమాలను నిర్వహించారు. కార్యక్రమానికి ముఖ్య అతిథిగా హాజరైన కలెక్టర్ సంబంధిత అధికారులకు దిశానిర్దేశం చేశారు. ఈజీఎస్లో జిల్లాను రాష్ట్రంతోపాటు జాతీయ స్థాయిలో ముందుంచాలని కోరారు. సెగ్రిగేషన్ షెడ్స్ వినియోగంలోకి తేవాలన్నారు. సెగ్రిగేషన్ షెడ్లలో వైకుంఠధామాల చుట్టూ మల్టీలేయర్తో పాటు 3 వరుసల ప్లాంటేషన్ పూర్తి కావాలని కలెక్టర్ స్పష్టం చేశారు. బృహత్ పల్లె ప్రకృతి వనాలపై దృష్టి సారించాలని సూచించారు.
మీ సేవ ద్వారా ధరణిలో దరఖాస్తు చేసుకోవాలి
జిల్లాలోని అర్జీదారులు తమ భూ సంబంధిత సమస్యల పరిష్కారం కోసం ప్రభుత్వ కార్యాలయాల చుట్టూ తిరగొద్దని కలెక్టర్ హనుమంతరావు సూచించారు. సోమవారం కలెక్టర్తో తమ గోడును వినిపించేందుకు జిల్లా నలుమూలల నుంచి అర్జీదారులు కలెక్టరేట్కు తరలివచ్చారు. కలెక్టర్ తన చాంబర్లో అర్జీలను స్వయంగా స్వీకరించారు. అర్జీదారుల సమస్యలను తెలుసుకొని, వారి ప్రతులను పరిశీలించారు. పలు ప్రాంతాల నుంచి వచ్చిన ప్రజలు పింఛన్లు, రేషన్కార్డులు, డబుల్ బెడ్రూం, భూ సమస్యలపై అర్జీలను అం దజేశారు. సమస్యలు త్వరితగతిన పరిష్కరించేందుకు చర్యలు తీసుకుంటామని హామీ ఇచ్చారు.