మెదక్, జూలై 25 :విస్తారంగా వర్షాలు కురుస్తుండడంతో రైతులు వివిధ రకాల పంటలను సాగు చేస్తున్నారు. వరి, పత్తి, కంది పంటలను అత్యధిక విస్తీర్ణంలో వేశారు. విత్తనాలు విత్తి దాదాపు నెల రోజులు కావస్తోంది. వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో వరుసగా వర్షాలు కురుస్తున్నాయి. ఈ క్రమంలో ఎలాంటి చర్యలు తీసుకోవాలనే దానిపై ప్రొఫెసర్ జయశంకర్ తెలంగాణ వ్యవసాయ విశ్వవిద్యాలయం, వ్యవసాయ పరిశోధన సంస్థ రాజేందర్నగర్ ఇటీవల ప్రత్యేక బులెటిన్ విడుదల చేసింది.
పత్తి పంటలో..
జిల్లాలో పత్తి విత్తిన పంట 20 నుంచి 40 రోజుల దశలో ఉంది. మొదటి దఫా ఎరువులైన 25 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ను ఎకరానికి వేయాల్సి ఉంటుంది. మొక్క మొదట్లో పాదులు తీసి, అందులో వేసి మట్టి కప్పాలి. వర్షం పడని సమయంలో మొక్కల మధ్య అంతర కృషి చేస్తే భూమి గుళ్లబారి, మొక్కకు అవసరమైన పోషకాలను అందిస్తుంది. పత్తిలో వడలు, తెగులు సోకుటకు అనుకూలం, తెగులు నివారణకు 3 గ్రా.కాపర్-ఆక్సిక్లోరైడ్ మందును ఒక లీటర్ నీటిని కలిపి మొక్క మొదలు చుట్టూ ఉన్న నేలను తడపాలి. ఆకుపచ్చ తెగులు, రసం పీల్చే పురుగుల నివారణకు 1గ్రా.కార్బెండజీమ్, 1.5 గ్రామ. ఎసిఫిట్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల నేపథ్యంలో పత్తిలో గూడు రాలడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. నివారణకు 2 మి.లీ ప్లానోపిక్స్ మందును పది లీటర్ల నీటికి కలిపి పది రోజుల వ్యవధిలో రెండుసార్లు పిచికారీ చేయాలి. వర్షాలు ఆగిన తర్వాత పై పాటుగా అదనపు మోతాదుగా ఎకరానికి 35 కిలోల యూరియా, 10 కిలోల పొటాష్ వేసుకోవాలి. ప్రత్తిలో వర్షాలు ఆగిన తర్వాత నేలలో పైపాటుగా ఎరువులు వేయలేని పక్షంలో 20 గ్రా.యూరియా లేదా 10 గ్రా. మల్టీ-కె మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
కంది పంటలో..
ప్రస్తుత వాతావరణ పరిస్థితులు కందిలో పైటోప్లోరా ఎండు తెగలు ఆశించడానికి అనుకూలంగా ఉంటుంది. తెగులు గమనించిన చోట వ్యాప్తి నివారణకు 3 గ్రామ. కాపర్-ఆక్సి-క్లోరైడ్ మందును ఒక లీటరు నీటికి కలిపి మొక్క మొదళ్లను పూర్తిగా తడపాలి. ఆకుమచ్చ తెగులు నివారణకు 1 గ్రామ. కార్బెండజిమ్ మందును లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వర్షాలు ఆగిన తర్వాత నేలలో పై పాటుగా ఎరువులు వేయలేని పక్షంలో 20 గ్రామ. యూరియా లేదా 10 గ్రామ. మల్టీ-కె మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి.
వరి పొలంలో..
వరి సాగు కొన్ని ప్రాంతాల్లో నారుమడి దశలో ఉండగా, మరికొన్ని ప్రాంతాల్లో నాటు వేయడం చేస్తున్నారు. ఇంకొన్ని ప్రాంతాల్లో ముందుగా నాటు వేయగా.. ఆ పొలాలు పిలక దశలో ఉన్నాయి. ముంపునకు గురైన వరి పొలాల్లో మురుగు నీటిని తీసివేయాలి. తాత్కాలికంగా నత్రజని ఎరువులు వేయడం ఆపివేయాలి. ప్రస్తుత వాతావరణ పరిస్థితుల్లో వరిలో బాక్టీరియా ఎండకు తెగులు సోకుటకు అనుకూలం. తొలిదశ వ్యాప్తి నివారణకు, మురుగు నీటిని తీసివేసి 0.4 గ్రామ. అగ్రిమైసిన్ లేదా 0.2 గ్రామ. ప్లాంటోమైసిన్ మందును ఒక లీటరు నీటికి కలిపి పిచికారీ చేయాలి. వరి నాటు వేసే వారం రోజుల ముందు ప్రతీ 2 గుంటల నారుమడికి 800 గ్రాముల కార్భోఫ్యూరాన్-3జీ గుళికలు వేసి, నారు నాటితే కాండం తొలిచే పురుగులను నివారించవచ్చు. గాలిలో అధిక తేమ ఉన్నప్పుడు ఆకుపచ్చ తెగులు లేదా అగ్గితెగులు ఆశించే అవకాశం ఉంటుంది. నాటు వేసిన తర్వాత ప్రధాన పొలంలో కలుపు నివారణకు ఎకరానికి 4 కిలోల చెన్ సల్ఫ్యూరాన్ మిథైల్, పెటాక్లోర్ గుళికలను నాటిన 3 నుంచి 4 రోజులలోపు 20 కిలోల ఇసుకలో కలిపి చల్లాలి. ఇప్పటికే నాటు వేసిన పొలాల్లో ఆకుమడతను శాస్త్రవేత్తలు గమనించారని, దీని నివారణకు 2 గ్రాముల కార్టాఫ్ హైడ్రోక్లోరైడ్ 50 శాతం మందును లీటర్ నీటికి కలిపి పిచికారీ చేయాలి.