కంది, జూలై 25: ఆ గ్రామంలోకి అడుగుపెడితే సమస్యలు స్వాగతం పలికేవి. మట్టిరోడ్లు, గుంతలదారులతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడేవారు. వీధుల్లో చెత్తాచెదారంతో దోమలు స్వైర విహారం చేసేవి. ఫలితంగా సీజనల్ వ్యాధులు వ్యాపించేవి. ఇదంత గతం.. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పల్లె ప్రగతి కార్యక్రమంతో ఆ గ్రామ రూపురేఖలే మారిపోయాయి. పారిశుధ్య చర్యలతో గ్రామం సంపూర్ణ స్వచ్ఛత దిశగా అడుగులు వేస్తున్నది. గ్రామంలో ప్రకృతి వనం ఆహ్లాదం పంచుతుండగా.. హరితహారంలో నాటిన మొక్కలు ఏపుగా పెరిగి కనువిందు చేస్తున్నాయి. అధికారులు, గ్రామస్తుల భాగస్వామ్యంతో గ్రామ అభివృద్ధే ప్రధాన ఎజెండాగా జీపీ పాలకవర్గం పనిచేస్తున్నది. మారుమూల గ్రామం ఇప్పుడు పట్టణానికి దీటుగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది. సంగారెడ్డి జిల్లా కంది మండలం కాశీపూర్ గ్రామం.
ఎటుచూసినా పచ్చందాలు..
గ్రామంలో ఎక్కడ చూసినా పచ్చని చెట్లు స్వాగతం పలుకుతున్నాయి. పల్లెప్రకృతి వనం చూపరులను ఎంతో ఆకట్టుకుంటున్నది. పచ్చని చెట్లతో వీధులన్నీ కళకళలాడుతున్నాయి. కాశీపూర్ ప్రధాన రహదారికి ఇరువైపులా ఉన్న హరితహారం చెట్లకు రంగులు అద్దడంతో ఆ రహదారి పచ్చని స్వాగత తోరణంలా మారింది.
అభివృద్ధి పనులు ఇలా..
గ్రామంలో స్థానిక సర్పంచ్ ఫరీదాబేగం ఆధ్వర్యంలో అభివృద్ధి పనులు జోరుగా కొనసాగుతున్నాయి. ఇప్పటికే గ్రామంలో పూర్తి స్థాయిలో అండర్గ్రౌండ్ డ్రైనేజీ వ్యవస్థ పనులు కొనసాగుతున్నాయి. కాగా, గతంలో రూ.11లక్షలతో అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు చేపట్టగా, అదనంగా మరో రూ.5లక్షలతో మిగిలిఉన్న పనులను పూర్తి చేస్తున్నారు. రూ.2లక్షలతో సీసీ రోడ్డునిర్మాణలను పూర్తి చేశారు. 8వ వార్డులో రూ.లక్షతో తాగునీటి బోరు తవ్వించారు. ప్రభుత్వ పాఠశాలలో దాతల సహకారంతో రూ.1.20లక్షలతో పాఠశాల గోడలపై అందమైన రంగులు వేయించారు. ప్రధానంగా పాఠశాల తరగతి గదులను రైలు బోగీలుగా పెయింటింగ్ వేయడంతో కలెక్టర్ హనుమంతరావు గ్రామాన్ని సందర్శించినప్పుడు పాఠశాల బాగుందని మెచ్చకున్నారు.
సీసీ కెమెరాల నిఘా..
గ్రామంలో ప్రస్తుతం అభివృద్ధి పనులు జోరుగా సాగుతున్నాయి. గ్రామానికి పక్కనే జిల్లా సబ్రిజిస్ట్రార్ కార్యాలయం ఉండడంతో గ్రామం మరింత అభివృద్ధి చెందుతుంది. గ్రామంలో ఎలాంటి సంఘటనలు, దొంగతనాలు చోటు చేసుకోకుండా సర్పంచ్ ఫరీదాబేగం అందరి సహకారంతో రూ.1.60 లక్షలతో ప్రధాన కూడళ్లలో సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు. కాశీపూర్ గ్రామం కంది-శంకర్పల్లి నాలుగు లేన్ల రహదారికి ఆనుకుని ఉండడంతో ఆ రహదారిపై కూడా ప్రత్యేకంగా సీసీ కెమెరాలను ఏర్పాటు చేయించారు.
గ్రామ వివరాలు ఇలా..
కాశీపూర్లో మొత్తం జనాభా 1769మంది ఉన్నారు. ఇందులో మహిళలు 898 మంది, పురుషులు 877 మంది కాగా, ఓటర్లు మొత్తం 1188 మంది ఉన్నారు. గ్రామ విస్తీర్ణం మొత్తం 600 ఎకరాలు ఉండగా.. ఇందులో సాగు విస్తీర్ణం 410 ఎకరాలు ఉన్నది. గ్రామంలో 447 ఇండ్లు ఉన్నాయి.
అందరి సహకారంతోనే అభివృద్ధి..
అందరి సహకారం ఉంటేనే ఏ గ్రామంలోనైనా అభివృద్ధి సాధ్యపడుతుంది. కాశీపూర్లో కూడా ఇదే తరహాలో అధికారులు. ప్రజాప్రతినిధులు, గ్రామస్తులు అందరూ గ్రామ అభివృద్ధి తమ వంతు సహకారాన్ని అందిస్తున్నారు. ఇప్పుడు గ్రామం ఇతర గ్రామాలకు ఆదర్శంగా అభివృద్ధిలో దూసుకుపోతున్నది.
గ్రామ అభివృద్ధికి కృషి..
టీఆర్ఎస్ ప్రభుత్వ హయాంలో గ్రామం అభివృద్ధిలో దూసుకుపోతున్నది. ప్రతి నెలా ప్రభుత్వం నిధులు అందిస్తుండడంతో అనేక అభివృద్ధి పనులు పూర్తి చేసుకున్నాం. ముఖ్యంగా వైకుంఠధామం, పల్లె ప్రకృతి వనం, డంపింగ్యార్డు నిర్మాణాలను పూర్తి చేసుకున్నాం. సీసీరోడ్లు, అండర్గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణ పనులు కొనసాగుతున్నాయి.