గజ్వేల్, జూలై 23: గజ్వేల్లో క్రీడాహబ్ ఏర్పాటుకు చర్యలను వేగవంతం చేసినట్లు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి, సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డి తెలిపారు. శుక్రవారం గజ్వేల్ పట్టణంలోని రింగురోడ్డు సమీపంలో, మినీ స్టేడియం పరిసరాల్లో ఉన్న ప్రభుత్వ భూమిని ఆర్డీవో విజయేందర్రెడ్డి, తహసీల్దార్ అన్వర్తో కలిసి క్రీడాహబ్ ఏర్పాటుకు పరిశీలించారు. అనంతరం సీఎం క్యాంపు కార్యాలయంలో విలేకరులతో మాట్లాడారు. సీఎం కేసీఆర్ గజ్వేల్ యువతీయువకులకు చక్కని విద్యనందించడానికి మహిళ, బాలుర ఎడ్యుకేషన్ హబ్లను నిర్మించారని, స్థానిక యువతీయువకులను అన్ని క్రీడల్లోనూ నైపుణ్యవంతంగా తీర్చిదిద్దడానికి 20 ఎకరాల్లో క్రీడాహబ్ను కూడా ఏర్పాటు చేయాలని నిర్ణయించారన్నారు. స్థానిక క్రీడాకారుల కోరిక మేరకు మంత్రి హరీశ్రావు క్రీడాహబ్ ఏర్పాటుకు సుముఖత వ్యక్తం చేశారని, ఈ మేరకు సీఎం కేసీఆర్కు క్రీడాహబ్ ఏర్పాటు చేయాలని విన్నవించామన్నారు.
సీఎం కేసీఆర్ ఇందుకు స్పందిస్తూ సాట్స్ చైర్మన్ వెంకటేశ్వర్రెడ్డిని వెంటనే ఏర్పాటుకు అవసరమైన చర్యలు చేపట్టాలని ఆదేశించినట్లు ఎఫ్డీసీ చైర్మన్ ప్రతాప్రెడ్డి తెలిపారు. అలాగే, రాష్ట్ర క్రీడలశాఖ గజ్వేల్లో క్రీడాహబ్కు స్థలాన్ని కేటాయించాలని జిల్లా కలెక్టర్కు ఆదేశాలు కూడా జారీ చేసినట్లు తెలిపారు. ఈ మేరకు శుక్రవారం గజ్వేల్ రింగురోడ్డు సమీపంలో, అలాగే మినీస్టేడియం పరిసరాల్లోని ప్రభుత్వ భూములను పరిశీలించినట్లు వెల్లడించారు. కొద్దిరోజుల్లోనే క్రీడాహబ్ పనులను ప్రారంభిస్తామన్నారు. గజ్వేల్ కొండపోచమ్మ ప్రాజెక్టుతో పాటు ఆలయాల అభివృద్ధితో గొప్ప పర్యాటక కేంద్రంగా మారుతుందని, క్రీడాహబ్ ఏర్పాటుతో మరింత అభివృద్ధి చెందనుందన్నారు.
రాష్ట్ర, జాతీయ స్థాయిలో ఆడేలా గజ్వేల్ క్రీడాకారులను తీర్చిదిద్దుతాం ..