సంగారెడ్డి కలెక్టరేట్, జూలై 22: జిల్లా వ్యాప్తంగా విస్తారంగా వర్షాలు కురుస్తున్నాయి. బుధవారం ఉదయం 8 నుంచి గురువారం ఉదయం 8 గంటల వరకు జిల్లా సరాసరి వర్షపాతం 2.16 సెం.మీ. నమోదు కాగా, అత్యధికంగా గుమ్మడిదలలో 3.5సెంటిమీటర్ల వర్షం కురిసింది. అత్యల్పంగా నాగల్గిద్దలో 1.3 సెం.మీ. వర్షం నమోదైంది. జిల్లాలోని దాదాపు అన్ని మండలాల్లో ఓ మోస్తారు నుంచి భారీ వర్షం కురిసింది. అందోల్ మండలంలో 3.2 సెం.మీ. వర్షం కురువగా, కంగ్టిలో 3 సెం.మీ.లు, కల్హేర్లో 2.8 సెం.మీ.లు, మనూర్లో 2.8 సెం.మీ, సిర్గాపూర్లో 2.7 సెం.మీ, జహీరాబాద్లో 2.6 సెం.మీ, మొగుడంపల్లి, కోహీర్లలో 2.5 సెం.మీ, జిన్నారంలో 2.3 సెం.మీ.లు, న్యాల్కల్, నారాయణఖేడ్ మండలాల్లో 2.1 సెం.మీ, పుల్కల్, హత్నూర మండలాల్లో 2 సెం.మీ. వర్షం కురువగా, మిగతా మండలాల్లో 1 నుంచి 2 సెంటిమీటర్లలోపు వర్షం కురిసింది. సంగారెడ్డి పట్టణంలో విద్యుత్ సరఫరాకు అంతరాయం ఏర్పడింది. వాహన చోదకులు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి.
రోడ్లు జలమయం
మున్సిపాలిటీ పరిధిలో రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో మున్సిపల్ ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. వర్షాలు కురుస్తుండడంతో వరదనీరు చేరి పలు వార్డుల్లోని రోడ్లన్నీ పూర్తిగా జలమయమయ్యాయి. దీంతో రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. పారిశుధ్య, విద్యుత్ సమస్యలు తలెత్తి ఇబ్బందులకు గురయ్యారు. వర్షాల కారణంగా ఎప్పుడు రద్దీగా ఉండే పారిశ్రామికవాడలో రోడ్లు నిర్మానుష్యంగా మారాయి. మున్సిపల్ కమిషనర్ రాజేంద్రకుమార్ ఎప్పటికప్పుడు పరిస్థితులను సమీక్షిసుస్తూ అధికారులను అప్రమత్తంగా ఉండాలని ఆదేశించారు.
ఆర్సీపురంలో
రెండు రోజులుగా ఎడతెరిపి లేకుండా వర్షాలు కురుస్తున్నాయి. ముసురుతో కూడిన వర్షం కురుస్తుండడంతో ప్రజలు ఇండ్లకే పరిమితమయ్యారు. ఆర్సీపురంలో 14.16 మి.మీ. వర్ష పా తం నమోదు చేసుకుంది. వర్షాలు సమృద్ధిగా కురుస్తుండడంతో భూగర్బ జలాలు మెరుగుపడుతున్నాయి. చెరువుల్లోకి వర్షపు నీరు చేరుతున్నాయి. వర్షాల కారణంగా రోడ్లపై వర్షపు నీరు నిలుస్తుండడంతో బల్దియా, మున్సిపల్ సిబ్బంది తొలగింపు చర్యలు చేపట్టారు. రెండు రోజులుగా వర్షాలతో వాతావరణం చల్లగా మారింది.
రెండు రోజులుగా ముసురు
బంగాళాఖాతంలో అల్పపీడం ఏర్పడడంతో రెండు రోజులుగా ఎడతెరపి లేకుండా ముసురు కురుస్తుంది. గురువారం మండల కేంద్రంతో పాటు మండల వ్యాప్తంగా ఎడతెరిపి లేకుండా వానలు కురుస్తున్నాయి. దీంతో రైతులు పొలాలబాట పట్టినారు. వరి నాట్లు వేయడానికి సన్నద్ధం చేస్తుండగా, కొందరూ వరినాట్లు వేస్తున్నారు. మరో రెండు రోజులు భారీ నుంచి అతి భారీగా వానలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు హెచ్చరిస్తున్నారు.