జిన్నారం, ఆగస్టు 4 : జిన్నారం మండలంలో రియల్ఎస్టేట్ ఊపు ఎక్కువగా ఉండడంతో ప్రభుత్వ భూములను కొందరు అక్రమార్కులు వదలడం లేదు. రాత్రికి రాత్రే రోడ్లు వేయడం, కుంటకట్టలను తొలిగించడం, ప్రభుత్వ భూములను ఆక్రమించడం చేస్తున్నారు. ఇలాంటి ఆక్రమణలను జిన్నారం రెవెన్యూ యంత్రాంగం అడ్డుకట్ట వేస్తున్నది. దశరథ్ తహసీల్దార్గా బాధ్యతలు తీసుకున్న తర్వాత యంత్రాంగం జిన్నారం మండలంలో ప్రభుత్వ భూముల ఆక్రమణ, కుంటకట్టల తొలిగింపు, శిఖం కబ్జాలను పూర్తిగా నిరోధించింది. రాత్రికి రాత్రే వేసిన రోడ్లను తెల్లారే లోపు జేసీబీలతో తొలిగించి కారకులపై కేసులు నమోదు చేసింది. ఇప్పటి వరకు సుమారు రూ.15 కోట్ల విలువైన 10.5 ఎకరాల భూములను రక్షించి సూచిక బోర్డులు ఏర్పాటు చేసింది. ఇందులో కొన్ని స్థలాలను ప్రభుత్వ అవసరాలకు కేటాయించింది. చెట్లపోతారం, పుట్టగూడ గ్రామాల్లో ఆక్రమణల నుంచి స్వాధీనం చేసుకున్న ప్రభుత్వ భూములను పల్లె ప్రకృతి వనాలకు కేటాయించింది.
ప్రభుత్వ అవసరాలకు భూముల కేటాయింపు
ప్రభుత్వం చేపట్టిన పల్లెప్రగతి కార్యక్రమంలో కొన్ని గ్రామాలు పల్లె ప్రకృతివనం, డంపింగ్ యార్డు, వైకుంఠధామం, నర్సరీ ఏర్పాటుకు స్థల సమస్య రావడంతో అధికారులు వెంటనే ప్రభు త్వ స్థలాలను గుర్తించి కేటాయించారు. ఇదే కా కుండా జిన్నారం మండలంలో ఉన్న ప్రభుత్వ భూముల వివరాలను ఉన్నతాధికారుల ఆదేశాల మేరకు టీఎస్ఐఐసీకి అందజేశారు. జిన్నారం సర్వేనంబర్1లో ఇంజినీరింగ్ పరిశ్రమల ఏర్పాటుకు పలు పరిశ్రమలు ముందుకు వచ్చాయి. అలాగే మంగంపేట గ్రామ శివారులోని పాలెం వద్ద సర్వేనంబర్ 55లో 22 ఎకరాల ప్రభుత్వ భూమిని గుర్తించి టీఎస్ఐఐసీకి పత్రాలను అందజేశారు. అక్కడ హెలీక్యాప్టర్ విడి భాగాల తయారీ పరిశ్రమ ఏర్పాటు కానున్నది. అలాగే మండల కేంద్రాల్లో పది ఎకరాల్లో పార్కు ఏర్పాటు చేయాలన్న ప్రభుత్వ నిర్ణయానికి స్థలాన్ని గుర్తించే పనిలో ఉన్నారు. పల్లె ప్రకృతికి స్థలాలను త్వరగా కేటాయించినందుకు మంత్రి హరీశ్రావు తహసీల్దార్ దశరథ్ను ప్రత్యేకంగా అభినందించి సన్మానించారు.
ప్రభుత్వ భూముల జోలికొస్తే చర్యలు
జిన్నారం మండలంలోని ప్రభుత్వ భూముల జోలికి ఎవరొచ్చినా చట్టప్రకారం చర్యలకు వెనుకాడం. ప్రభుత్వ భూముల కబ్జాకు గురవుతున్నట్లు సమాచారం వచ్చిన వెంటనే మా సిబ్బందితో వెళ్లి అడ్డుకుంటున్నాం. అందుబాటులో లేకపోతే తమ సిబ్బందిని పంపిస్తున్నాం. పోలీసుల సహకారంతో అక్రమ నిర్మాణాలను తొలిగించాం. బొల్లారం మున్సిపాలిటీ, గడ్డిపోతారం, ఖాజీపల్లి పంచాయతీల్లో విలువైన ప్రభుత్వ భూములను కబ్జాల నుంచి కాపాడాం. ప్రభుత్వ భూమి అంటూ సూచిక బోర్డులు ఏర్పాటు చేస్తున్నాం.
ఆక్రమణల నుంచి కాపాడిన భూముల వివరాలు..