నర్సాపూర్, అక్టోబర్ 25 : నర్సాపూర్ అర్బన్ పార్కు అందాలు అద్భుతంగా ఉన్నాయని యునైటెడ్ స్టేట్ ఏజెన్సీ ఫర్ ఇంటర్నేషనల్ డెవలప్మెంట్(యూడీఏఐడీ) బృందం సభ్యులు కితాబు ఇచ్చారు. సోమవారం నర్సాపూర్ అర్బన్ పార్కును యూడీఏఐడీ బృందం సందర్శించింది. అర్బన్ పార్కులో పెరిగిన మొక్కలను చూసి బృందం సభ్యులు ఆనందం వ్యక్తం చేశారు. హరితహారంలో నాటిన మొక్కలు, అటవీ పునరుద్ధరణ పనులను తెలంగాణ ముఖ్యసంరక్షణ అధికారి లోకేశ్ జైశ్వాల్, సీసీఎఫ్ శర్వానన్ ఫొటో స్టాల్ ద్వారా బృందానికి వివరించారు. అనంతరం వాచ్టవర్ పైనుంచి ఫారెస్ట్ అందాలను చూసి మైమరచిపోయారు. అర్బన్ పార్కులో పండిన సీతాఫలాలను రుచి చూసి బాగుందన్నారు. పార్కును పరిశీలించిన వారిలో బృందం సభ్యులు యూడీఏఐడీ డిప్యూటీ అసిస్టెంట్ అంజలీ కౌర్, మిషన్ డైరెక్టర్ ఇండియా వీణారెడ్డి, సీనియర్ ఫారెస్ట్ అడ్వైజర్ వర్గీస్ పాల్, ప్రోగ్రామ్ ఆఫీసర్ అలైన్ లీ ఉన్నారు. వారి వెంట డీఎఫ్వోలు రవిప్రసాద్, జ్ఞానేశ్వర్, ఎఫ్ఆర్వోలు అంబర్సింగ్, మనోజ్కుమార్, ఫారెస్ట్ ప్లస్ 2.0 టీమ్ సభ్యులు తదితరులు ఉన్నారు.
పోచారం అభయారణ్యం, వన విజ్ఞాన కేంద్రం సందర్శన..
మండల పరిధిలోని పోచారం అభయారణ్యం, వనవిజ్ఞాన కేంద్రాన్ని సోమవారం యూఎస్ఐడీ బృందం సందర్శించింది. ఐదుగురు సభ్యులతో కూడిన యూఎస్ఐడీ బృందం పర్యావరణం, అటవీ పెంపకం తదితర అంశాల గురించి అధికారులను అడిగి తెలుసుకున్నారు. ఈ సందర్భంగా సంప్రదాయ వేషధారణలో గిరిజన మహిళలు నృత్యం చేస్తూ యూఎస్ఏ బృందానికి స్వాగతం పలికారు. వారి వెంట యూఎస్ఐడీ మిషన్ డైరెక్టర్ వీణరెడ్డి, ప్రోగ్రాం ఆఫీసర్ అలియాన్లీ, సీసీఎఫ్ శరవణన్, డీఎఫ్వో రవిప్రసాద్, డిప్యూటీ రేంజర్ మనోజ్కుమార్, ఎఫ్డీవో ఫ్లయింగ్ స్వాడ్ జ్ఞానేశ్వర్, సిబ్బంది ప్రసాద్ ఉన్నారు.