మద్దూరు, జూలై 14 : ఆ బాలుడు అడవిలో పుట్టి అడవిలోనే పెరిగాడు. తల్లిదండ్రులు చూపిన బాటలోనే ఆయుధం పట్టి మావోయిస్టు అగ్రనేతగా ఎదిగాడు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందిన కొన్నేండ్లకు పోలీసుల ఎదుట లొంగిపోయి జనజీవన స్రవంతిలో కలిశాడు. సిద్దిపేట జిల్లా ధూళిమిట్ట మండలం బెక్కల్ గ్రామానికి చెందిన రావుల శ్రీనివాస్ అలియాస్ రామన్న ధూళిమిట్ట హాస్టల్ ఉంటూ 7వ తరగతి చదువుతున్న సమయంలో 1982లో పీపుల్స్వార్లో చేరాడు. రావుల శ్రీనివాస్ పీపుల్స్వార్లో వివిధ బాధ్యతలు నిర్వర్తించి మావోయిస్టు కేంద్ర కమిటీ సభ్యుడిగా ఎదిగాడు. మావోయిస్టు పార్టీలో పనిచేస్తున్న క్రమంలోనే ఉద్యమ సహచరిణి అరుణ అలియాస్ సావిత్రిని శ్రీనివాస్ వివాహం చేసుకున్నాడు. వీరికి 1998లో రంజిత్ జన్మించాడు. రావుల శ్రీనివాస్ దంపతులు రంజిత్ను ఛత్తీస్గఢ్ రాష్ట్రంలోని పుట్టెపాడులో జనతన సర్కారు ఆధ్వర్యంలో కొనసాగుతున్న పాఠశాలలో ఆరో తరగతి వరకు చదివించారు.
అనంతరం తన కొడుకు రంజిత్ను రావుల శ్రీనివాస్ సహచరి, ఏరియా కమాండర్ నగశ్ సహాయంతో నిజామాబాద్లోని కాకతీయ పాఠశాలలో రహస్యంగా పదో తరగతి వరకు చదివించాడు. రంజిత్ వేసవి సెలవుల్లో తల్లిదండ్రులు ఉండే దండకారణ్యంలోకి వెళ్లేవాడు. 2015లో నగేశ్ ఓ ఎన్కౌంటర్లో మృతి చెందగా, శ్రీనివాస్ తన కొడుకు రంజిత్ను బయటకు పంపిస్తే అంతమంచిది కాదని భావించి తన వద్దనే ఉంచుకున్నాడు. ఈ క్రమంలో మావోయిస్టు సిద్ధ్దాంతాలకు ఆకర్షితుడైన రంజిత్, 2017లో మావోయిస్టు పార్టీలో చేరి రెండో ప్లాటూన్ మొదటి కంపెనీ పార్టీ సభ్యుడిగా క్రియాశీలకంగా పని చేశాడు. 2019 వరకు రంజిత్ పీపీసీ సభ్యుడిగా పనిచేశాడు. ఆయన నాలుగు హింసాత్మక దాడుల్లో పాల్గొన్నట్లు పోలీసులు వెల్లడించారు. తండ్రి అనారోగ్యంతో మృతి చెందిన నాటి నుంచి తల్లి సూచన మేరకు జనజీవన స్రవంతిలో కలిసేందుకు ప్రయత్నించాడు. ఎట్టకేలకు రంజిత్ బుధవారం హైదరాబాద్లో డీజీపీ మహేందర్రెడ్డి సమక్షంలో లొంగిపోయాడు.
తమ్ముడి కొడుకును అక్కున చేర్చుకుంటాం..
నా తమ్ముడు రావుల శ్రీనివాస్ చిన్ననాడే ఇంటిని వదిలి మావోయిస్టు పార్టీలోకి వెళ్లాడు. రెండేండ్ల క్రితం అనారోగ్యంతో చనిపోయాడని తెలిసి చాలా బాధపడ్డాం. అప్పు డు తమ్ముడికి భార్య, కొడుకు ఉన్నారని తెలిసింది. తమ్ముడి కొడుకు లొంగిపోయినట్లు వార్తలొస్తున్నాయి. మా ఇంటికొస్తే మా తమ్ముడి లెక్కనే చూసుకుంటాం. మా ఇంటికి రావాలని కోరుకుంటున్నాం.