మెదక్, సెప్టెంబర్ 21 : కూతురు అన్నం తిన డం లేదని చితకబాదిన ఘటనలో తండ్రి నాగరాజును అరెస్టు చేసినట్టు జిల్లా ఎస్పీ చందనదీప్తి తెలిపారు. మంగళవారం జిల్లా పోలీసు ప్రధాన కార్యాలయంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఘటనకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. మెదక్ పట్టణానికి చెందిన మాడిశెట్టి నాగరాజు, మౌనిక భార్యాభర్తలు. వీరికి ఇద్దరు పిల్లలు ఉన్నారు. పట్టణ శివారులోని హౌసింగ్బోర్డు కాలనీలో నివాసముంటున్నారు. మెదక్ మున్సిపాలిటీలో రోజువారీ కూలీగా (ట్రాక్టర్ డ్రైవర్)గా నాగరాజు పనిచేస్తున్నాడు. రెండు నెలలుగా నాగరాజు మరో మహిళతో సన్నిహితంగా ఉంటున్నాడు. భార్య నాగరాజుతో గొడవపడి పుట్టింటికి వెళ్లింది. ఆదివారం రాత్రి కూతురు గగనశ్రీతో సన్నిహితంగా మహిళ వద్దకు వెళ్లాడు. కూతురు అన్నం తినడం లేదని చితకబాదుతున్న సందర్భంలో చుట్టూ పక్కల వారు వీడియో తీశా రు. సోమవారం వీడియో సోషల్ మీడియాలో వైరల్ అయ్యింది.
స్పందించిన పోలీసులు చిన్నారి గగనశ్రీతో పాటు తండ్రి నాగరాజు, అతడితో సన్నిహితంగా ఉంటున్న మహిళను పోలీస్స్టేషన్కు తరలించారు. తండ్రి నాగరాజుపై సుమోటా కేసు నమోదు చేసి రిమాండ్కు తరలించారు. అనంతరం ఎస్పీ చందనదీప్తి మాట్లాడుతూ.. బాల్యం ఎంతో మధురమైనదని, పిల్లలను మంచి పౌరులుగా తీర్చిదిద్దాలంటే బాల్యం ఎంతో ముఖ్యమైనదన్నారు. బాల్యాన్ని కాపాడాల్సిన బాధ్యత సమాజంలో ప్రతిఒక్క పౌరుడిపై ఉందన్నారు. చిన్న పిల్లలపైన ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడినా విడిచిపెట్టేది లేదని హెచ్చరించారు. బాల్యం చాలా అందమైనదని, వారి బం గారు భవిష్యత్కు బాటలు వేసే వారే ఇలాంటి చర్యలకు పాల్పడడం బాధాకరమన్నారు. బాలలను హింసించడం, వారితో పనులు చేయిస్తే బాల కార్మిక చట్టం కింద శిక్షార్హులవుతారని హెచ్చరించారు. బాలలపైన ఎవరైనా అఘాయిత్యాలకు పాల్పడితే 1098 లేదా డయల్ 100కి సమాచారం అందించాలని తెలిపారు. సమావేశంలో జిల్లా అదనపు ఎస్పీ కృష్ణమూర్తి, మెదక్ డీఎస్పీ సైదు లు, పోలీసు సిబ్బంది పాల్గొన్నారు.
విధుల్లో నుంచి నాగరాజు తొలిగింపు
మున్సిపాలిటీ తాత్కాలిక డ్రైవర్ నాగరాజును విధుల్లో నుంచి తొలిగించినట్లు మున్సిపల్ కమిషనర్ శ్రీహరి తెలిపారు. నాగరాజు తన కూతురును విచక్షణ రహితంగా చితకబాదినందుకు పోలీస్ స్టేషన్లో కేసు నమోదు కావడంతో విధుల నుంచి తొలగించినట్లు ఆయన పేర్కొన్నారు.