సిద్దిపేట, జూలై 16 : సిద్దిపేటను చెత్తరహిత పట్టణంగా తీర్చిదిద్దుదామని ఆర్థిక శాఖ మంత్రి తన్నీరు హరీశ్రావు అన్నారు. శుక్రవారం సిద్దిపేట మున్సిపల్ కార్యాలయంలో కౌన్సిలర్లు, అధికారులతో చెత్త నిర్వహణ, యూజీడీ సద్వినియోగం, మొక్కల పెంపకంపై మంత్రి దిశా నిర్దేశం చేశారు. ఈ సందర్భంగా మంత్రి హరీశ్రావు మాట్లాడుతూ పట్టణంలో అండర్ గ్రౌండ్ డ్రైనేజీని సమర్థవంతంగా వినియోగించుకోవాలన్నారు. ప్లాస్టిక్ లేకుండా ఆయా వార్డుల్లో ఏర్పాటు చేసిన స్టీల్ బ్యాంకులను ఉపయోగించుకోవాలని పిలుపునిచ్చారు. రోడ్లకు ఇరువైపులా మొక్కలను నాటి పచ్చని ‘పేట’గా మారుద్దామన్నారు. కౌన్సిలర్లు, అధికారులు ప్రత్యేక దృష్టి సారించి సంకల్పంతో పనిచేయాలన్నారు. చెట్లు నరికే వారిపై కఠినంగా వ్యవహరించాలని, ఎక్కడా ఖాళీ స్థలం ఉన్నా మొక్కలు నాటాలన్నారు. పట్టణంలో ప్రతిరోజు 55 మెట్రిక్ టన్నుల చెత్త ఉత్పత్తి అవుతున్నదని, సంవత్సరానికి రూ.2 కోట్ల కేజీల చెత్త ఉత్పత్తి అవుతుందన్నారు. డంపింగ్యార్డులు చెత్తతో నిండిపోయి రేపటి తరాలకు కాలుష్యమే మిగులుతుందన్నారు. ఖాళీ ప్లాట్లలో చెత్త వేసే వారిని గుర్తించి చర్యలు తీసుకోవాలన్నారు. చెత్త నిర్వహణపై పాఠాలు చెప్పేందుకే స్వచ్ఛబడిని ఏర్పాటు చేశామన్నారు. ప్రజలందరూ స్వచ్ఛబడికి వెళ్లి వ్యర్థాల నిర్వహణను తెలుసుకోవాలన్నారు.
రూ.4 .30 కోట్లతో బయోగ్యాస్
సిద్దిపేట పట్టణంలో చెత్తను గ్యాస్గా మార్చేందుకు రూ.4.30కోట్లతో బుస్సాపూర్లో బయో గ్యాస్ ప్లాం ట్ను ఏర్పాటు చేస్తున్నామన్నారు. త్వరలోనే అండర్ గ్రౌండ్ డ్రైనేజీ నిర్మాణంలో భాగంగా నర్సపురం చెరు వు వద్ద నిర్మించిన ఎస్టీపీ ట్యాంకును వినియోగంలోకి తీసుకువస్తామన్నారు. సిద్దిపేట మున్సిపాలిటీకి పొడి చెత్త ద్వారా ప్రతినెలా రూ.2.30 లక్షల ఆదా యం వస్తుందన్నారు. పట్టణంలోని మోరీల్లో వర్షం నీరు తప్ప మురుగు నీరు కనిపించవద్దన్నారు. చెత్త రహిత పట్టణంగా సిద్దిపేటను తీర్చిదిద్దడంతో ఒక్కో కుటుంబంపై రూ.25 వేల ఆర్థిక భారం తగ్గుతుందని మంత్రి వివరించారు.
తొలి వారంలో 8 వార్డులో స్పెషల్ డ్రైవ్
ఆరోగ్య సిద్దిపేటను నిర్మించే క్రమంలో మొదటి వారం మున్సిపల్ పరిధిలోని 8 వార్డుల్లో చెత్త సేకరణ, వ్యర్థాలను వేరు చేయడం, మొక్కలు నాటడం, యూజీడీని సమర్థవంతంగా వినియోగించుకునేందుకు కార్యక్రమాలు చేపట్టాలన్నారు. ఇందుకు ప్రణాళికలు సిద్ధం చేయాలని మున్సిపల్ చైర్పర్సన్, కమిషనర్లకు మంత్రి హరీశ్రావు ఆదేశించారు. స్వచ్ఛబడికి వారం రోజులపాటు రోజు రెండు వార్డుల ప్రజలు పాల్గొనేలా ఏర్పాట్లు చేయాలని మున్సిపల్ కమిషనర్ను ఆదేశించారు. నీటి సరఫరా, చెత్త బండ్లు ప్రతి వార్డుకు ఉద యం 9గంటల వరకే వెళ్లి సమయపాలన పాటించేలా చర్యలు తీసుకోవాలన్నారు. సాలిడ్ వేస్ట్ మేనేజ్మెంట్ నిపుణురాలు డాక్టర్ శాంతి సభ్యులకు వ్యర్థాలు పేరుకుపోవడంతో కలిగే అనర్థాలను పవర్ పాయింట్ ప్రజంటేషన్ ద్వారా వివరించారు. సమావేశంలో మున్సిపల్ చైర్పర్సన్ మంజులారాజనర్సు, వైస్ చైర్మన్ జంగిటి కనకరాజు, ఏఎంసీ చైర్మన్ పాల సాయిరాం, సుడా డైరెక్టర్ వేణుగోపాల్రెడ్డి, కౌన్సిలర్లు మెప్మా సిబ్బంది, అధికారులు పాల్గొన్నారు.