వర్షాకాలం వచ్చిందంటే వాగులు పొంగి రాకపోకలు నిలిచిపోయేవి. ప్రజలు ప్రాణాలు అరచేతిలో పెట్టుకొని ప్రయాణం సాగించాల్సి వచ్చేది. ఒక్కోసారి రోజుల తరబడి రాకపోకలు నిలిచిపోయి బాహ్య ప్రపంచంతో సంబంధాలు తెగిపోయేవి. అనారోగ్య సమస్యలు తలెత్తితో దేవుడిపైనే భారం వేయాల్సి వచ్చేది. ఇదంతా ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పటి పరిస్థితి. కానీ, ఇప్పుడుఆ బాధలు తీరాయి. పరిస్థితులు పూర్తిగా మారాయి. శిథిలావస్థకు చేరిన బ్రిడ్జిలు, దెబ్బతిన్న రహదారులకు మోక్షం లభించింది. అనేక వాగులపై కొత్త వంతెనలను తెలంగాణ ప్రభుత్వం నిర్మించింది. దీంతో వానొచ్చినా.. వరదొచ్చినా ప్రయాణం సాఫీగానే సాగుతున్నది. వంతెనల నిర్మాణంతో దూరభారం తగ్గడంతో పాటు ప్రయాణం సులభతరంగా మారింది. సీఎం కేసీఆర్ సారుకు ప్రజలు ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నారు.
రూ.22.50 కోట్లతో 11 వంతెనలు
తెలంగాణ ఏర్పడిన తర్వాత రూ.22.50కోట్లతో నూతనంగా 11 బ్రిడ్జిల నిర్మాణం చేపట్టి ప్రజల ఇబ్బందులను తొలగించారు సీఎం కేసీఆర్. తూప్రాన్ సబ్డివిజన్ పరిధిలోని తూప్రాన్ మండలం వెంకటరత్నాపూర్లో రూ.7 కోట్లతో బ్రిడ్జి నిర్మాణం పూర్తి చేశారు. నర్సంపల్లిలో రూ.50లక్షలతో మరో బ్రిడ్జిని పంచాయతీరాజ్శాఖ ఆధ్వర్యంలో నిర్మించారు. చేగుంట, నార్సింగి, రామాయంపేట మండలాల వ్యాప్తంగా రోడ్ల భవనాలశాఖ ఆధ్వర్యంలో రూ.12 కోట్లతో ఏడు బ్రిడ్జిలు నిర్మించారు. పంచాయతీరాజ్శాఖ ద్వారా మెదక్ జిల్లా సరిహద్దులో నిజాంపేట మండలం చల్మెడ, నస్కల్ గ్రామాల ప్రజల కోసం రూ.2.80కోట్లతో రెండు బ్రిడ్జిలు నిర్మించారు.
‘పోతిరెడ్డిపల్లి-కోహీర్’కు నారింజ వాగుపై బ్రిడ్జి
కోహీర్ నుంచి పోతిరెడ్డిపల్లికి వెళ్లేందుకు ఐదు కిలోమీటర్లు ప్రయాణించాల్సి ఉంటుంది. రెండు గ్రామాల శివారు మధ్యలో నారింజవాగు ఉండటంతో గతంలో సీసీ రోడ్డు నిర్మించారు. కానీ ప్రస్తుతం శిథిలావస్థకు చేరటంతో ఆమార్గం గుండారాకపోకలు నిలిచిపోయాయి. పోతిరెడ్డిపల్లి, ఘనపూర్ గ్రామాల ప్రజలు కోహీర్ పట్టణానికి చేరుకోవాలంటే వెంకటాపూర్, కవేలి జాతీయ రహదారిగుండా వెళ్లాల్సిన పరిస్థితి ఏర్పడింది. దీంతో ఐదు కిలోమీటర్లకు బదులు 16 కిలోమీటర్లు ప్రయాణించాల్సిన పాఠశాలలు, కళాశాల, ఎంపీడీవో, తహసీల్దార్, పోలీస్స్టేషన్, మార్కెట్, తదితర పనుల కోసం తప్పకుండా కోహీర్ పట్టణానికి వెళ్లాల్సి ఉంటుంది. నారింజ వాగు సమీపంలో మరో సీసీ రోడ్డుకోతకు గురైంది. దీంతో పదేండ్లు ఆ మార్గం గుండా బస్సులను నిలిపివేశారు. ప్రజలు పడుతున్న ఇబ్బందులను గుర్తించిన అధికారులు పోతిరెడ్డిపల్లి-కోహీర్ గ్రామాల మధ్య నారింజ వాగుపై బ్రిడ్జి నిర్మించాలని ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపారు.తెలంగాణ ప్రభుత్వం బ్రిడ్జి నిర్మాణానికి వెంటనే రెండు కోట్లు మంజూరు చేసింది. ప్రస్తుతం బ్రిడ్జిని అందుబాటులోకి తీసుకువచ్చారు. దీంతో ఆయా గ్రామాల ప్రజలు హర్షం వ్యక్తం చేస్తున్నారు.
ఈజీగా ప్రయాణం
పటాన్చెరు నియోజకవర్గంలో తెలంగాణ రాక ముందు వర్షాకాలంలో చాలా గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయేవి. తెలంగాణ వచ్చిన తర్వాత ఆర్అండ్బీశాఖ ద్వారా రూ. 18 కోట్లు ఖర్చు చేసి ఏడు కొత్త బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. దీంతో ప్రయాణం సాఫీగా కొనసాగుతున్నది. ఆర్అండ్బీ శాఖ ద్వారా పటాన్చెరు పట్టణ పరిధిలో ఇంద్రేశం వెళ్లే దారిలో, పెద్దకంజర్ల వైపు ఇంద్రేశం వద్ద , పెద్దకంజర్ల-బేగంపేట దారిలో బ్రిడ్జిలు నిర్మించారు. బొంతపల్లి -జిన్నారం మధ్యలో మూడు బ్రిడ్జిల నిర్మాణం చేపట్టారు. సోలక్పల్లిలో ఒక వంతెనని నిర్మించారు. రామేశ్వరంబండ గ్రామంలో ఆర్అండ్బీశాఖ ద్వారా రూ. 3.50 కోట్లతో బ్రిడ్జిని నిర్మించారు. గతంలో ఈ బ్రిడ్జి లేని సమయంలో వర్షాకాలంలో వాగుదాటడం పెద్ద సమస్యగా మారేది. వాగు పారినప్పుడు రాకపోకలు స్తంభించేవి. ఇప్పుడు ప్రజలు సాఫీగా ప్రయాణం చేస్తు న్నారు.
నాడు ఇబ్బందులు.. నేడు సంతోషం
ఒకప్పుడు భారీ వర్షాలు వస్తే ఆయా గ్రామాలకు వెళ్లాలంటే ప్రజలు ఇబ్బందులు పడేవారు. తెలంగాణ వచ్చిన తర్వాత పరిస్థితి మారిపోయింది. కొత్త బ్రిడ్జిలకు మోక్షం లభించింది. భారీ వర్షాలు వస్తే మెదక్ జిల్లా హవేళీఘనపూర్ మండలం కొత్తపల్లి, రాజ్పేట గ్రామాల మధ్య ఉన్న వాగులతో గ్రామస్తులు, వాహనదారులు ఇబ్బందులు పడేవారు. 2015లో ఆ బ్రిడ్జి కూలిపోయిం ది. దీంతో ఆ దారివెంట వెళ్లే వారు, కొత్తపల్లి, రాజ్పేట్, కప్రాయిపల్లి, కప్రాయిపల్లితండా, పొల్కంపేట గ్రామాలకు వెళ్లాలంటే ఇబ్బందులు ఏర్పడేది. 2018లో రాజ్పేట, కొత్తపల్లి మధ్య బ్రిడ్జి నిర్మాణానికి నిధులు మంజూరు చేయాలని మెదక్ ఎమ్మెల్యే పద్మాదేవేందర్రెడ్డి ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లగా వెంటనే ప్రభుత్వం రూ.4.50 కోట్లు మంజూరు చేసింది. పంచాయతీరాజ్శాఖ ద్వారా బ్రిడ్జి నిర్మా ణం పూర్తయింది. దీంతో ఆయా గ్రామాల ప్రజలు సంతోషం వ్యక్తం చేశారు.
తొలిగిన ఇబ్బందులు..
దుబ్బాక నియోజకవర్గంలో కూడవెల్లి వాగు పరిసర ప్రాంతాలతో పాటు ఇతర సమస్యాత్మక రహదారుల వద్ద మొత్తం 8 బ్రిడ్జిలు నిర్మించారు. దుబ్బాక మండలంలో భూంపల్లి-పోతారెడ్డి వద్ద రూ. 1.50 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. మిరుదొడ్డి మండలంలో మిరుదొడ్డి, అల్వాల్ గ్రామాల మధ్య రూ.8 కోట్లతో రెండు బ్రిడ్జీలు నిర్మించారు. తొగుట మండలంలో లింగంపేట వద్ద రూ.4 కోట్లతో బ్రిడ్జి నిర్మించడంతో స్థానిక రైతులతో పాటు గజ్వేల్, దుబ్బాక నియోజకవర్గ ప్రయాణికుల ఇబ్బందులు తీరాయి. దౌల్తాబాద్ మండలంలో దౌల్తాబాద్ వద్ద, రాయపోల్ మండలంలో కొత్తపల్లి, తిమ్మక్కపల్లి వద్ద మూడు బ్రిడ్జిలు నిర్మించారు. దుబ్బాక మండలం భూంపల్లి-పోతారెడ్డిపేట మధ్య రూ. 1.50 కోట్లతో బ్రిడ్జి నిర్మించారు. దివంగత ఎమ్మెల్యే రామలింగారెడ్డి ప్రత్యేక చొరవతో భూంపల్లి- పోతారెడ్డిపేట బ్రిడ్జికి రూ.1.5 కోట్లు మంజూరు చేయించారు. బ్రిడ్జి నిర్మాణంతో దుబ్బాక, మిరుదొడ్డి ప్రజలతో పాటు మెదక్, కామారెడ్డి జిల్లా వాసులకు సమస్య తీరింది.