రాష్ట్రంలో ప్రభుత్వపరంగా భూముల మార్కెట్ విలువను పెంచేందుకు రంగం సిద్ధమైంది. దీనిపై సుదీర్ఘ కసరత్తు నిర్వహించిన ప్రభుత్వ, అధికార యంత్రాంగం వివిధ కేటగిరీల్లోని భూముల విలువ పెంపునకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. విశ్వసనీయ సమాచారం మేరకు… జీహెచ్ఎంసీతో పాటు హెచ్ఎండీఏ పరిధిలో ప్రస్తుతం చదరపు గజానికి రూ.20వేల వరకు ఉన్న మార్కెట్ విలువను 30 శాతం మేర పెంచేందుకు నిర్ణయించినట్లు తెలిసింది. దీంతో పాటు గ్రేటర్ పరిధిలో ఇప్పటి వరకు ఉన్న కనిష్ఠ ధర రూ.2వేల నుంచి రూ.3వేలకు పెరగనుండగా… గ్రేటర్ అవతల హెచ్ఎండీఏ పరిధిలో ఉన్న రూ.500 కనిష్ఠ ధర రూ.800 పెంచేందుకు ప్రతిపాదించారు. మరోవైపు హెచ్ఎండీఏ పరిధిలో పెద్ద ఎత్తున ఉన్న అపార్టుమెంట్లలోని ఫ్లాట్ల ధరను కూడా పెంచేందుకు ప్రభుత్వం నిర్ణయించడంతో ఆ మేరకు ప్రస్తుతం చదరపు మీటరుకు రూ.4వేల కంటే ఎక్కువగా ఉన్న మార్కెట్ విలువను 30 శాతం వరకు పెంచేందుకు ప్రతిపాదించారు. ఇక.. రాష్ట్రంలోని వ్యవసాయ భూముల మార్కెట్ విలువను కూడా నాలుగు కేటగిరీలుగా విభజించి, పెంపుదలను ప్రతిపాదించారు.
సిటీబ్యూరో ప్రధాన ప్రతినిధి, జూలై 16 (నమస్తే తెలంగాణ):దాదాపు ఎనిమిదేండ్ల కిందట ఉమ్మడి రాష్ట్రంలో భూముల మార్కెట్ విలువను అప్పటి ప్రభుత్వం పెంచింది. 2013, ఏప్రిల్లో రేట్లను పెంచుతూ అప్పటి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది. ఆ తర్వాత తెలంగాణ రాష్ట్రం ఏర్పడటంతో హైదరాబాద్ మహా నగరం అంతర్జాతీయ పెట్టుబడులకు కేంద్రంగా మారడంతో పాటు అన్ని రంగాల్లో గణనీయంగా అభివృద్ధి సాధించింది. ఇందుకు గత రెండు రోజులుగా జరుగుతున్న ప్రభుత్వ స్థలాల ఈ-వేలంలో కనిపిస్తున్న పోటీ, పలుకుతున్న ధరలే నిదర్శనం. దీంతో పాటు రాష్ట్రవ్యాప్తంగా సాగునీటి వసతి గణనీయంగా పెరిగింది. తెలంగాణ ప్రభుత్వం కృష్ణా, గోదావరిపై అనేక ప్రాజెక్టులను నిర్మించడంతో పాటు మిషన్ కాకతీయ ద్వారా వేలాది చెరువులకు పూర్వ వైభవం రావడంతో సాగు విస్తీర్ణం ఊహించనిరీతిలో పెరిగింది. ఫలితంగా ఉమ్మడి రాష్ట్రంలో వేలల్లో ఉన్న వ్యవసాయ భూముల ధరలు ఇప్పుడు లక్షల్లోకి ఎగబాకాయి. పైగా భూమి విలువ ప్రతి ఒక్కరికీ తెలియడంతో రైతులు ఎకరా కూడా అమ్మేందుకు ముందుకు రావడం లేదు. ఇలా తెలంగాణలో భూములకు భారీగా డిమాండ్ పెరిగింది. ఇందుకు సుదీర్ఘ కసరత్తు చేసిన తర్వాత బహిరంగ మార్కెట్ విలువను దృష్టిలో ఉంచుకొని వివిధ కేటగిరీల్లోని భూముల విలువ పెంపునకు ప్రతిపాదించారు.
మండల కేంద్రాలు, 50వేల లోపు జనాభా ఉన్న మున్సిపాలిటీల (వేములవాడ టెంపుల్ డెవలప్మెంట్ అథారిటీ సహా) పరిధిలో ప్రస్తుతం కనిష్ఠ ధర గజానికి రూ.200 వరకు ఉండగా దానిని రూ.300, 201-వెయ్యి రూపాయల వరకు ఉన్న వాటిపై 50 శాతం పెంపు, రూ.1,001-5వేల వరకు ఉన్న వాటిపై 40 శాతం లేదా 1,500 ఏది ఎక్కువగా ఉంటే అది, గజానికి రూ.5వేలు దాటిని వాటిపై 30 శాతం లేదా రూ.7వేలు ఏది ఎక్కువగా ఉంటే ఆ విలువను పెంపుదలగా తీసుకోనున్నారు.
అపార్టుమెంట్లు… ఫ్లాట్లు…