మెదక్ రూరల్ జూలై 19 : తెలుగు వారు పవిత్రంగా భావించే తిథుల్లో ఏకాదాశి ఒకటి. ప్రతి నెలలో రెండుసార్లు ఏకాదశి తిథులు ఉన్నప్పటికీ ఆషాఢమాసంలో వచ్చే తొలి ఏకాదాశికి ప్రాధాన్యతనిస్తారు. లోక రక్షకుడైన శ్రీ మహా విష్ణువు అనుగ్రహంతో అకాల మృత్యుహరణంతో పాటు మోక్ష ప్రాప్తి కోసం ఈ రోజున కఠిన నియమాలతో ఉపవాస వ్రతాలు ఆచరించడం ప్రత్యేకంగా కనిపిస్తుంది. మోక్ష సాధనకు మనస్సును మహా విష్ణువుపైన లగ్నం చేసి ఆరాధించడమే ఏకాదశి పండగ ప్రత్యేకం. ఏకాదశి రోజున ఉపవాస దీక్షలు ఆచరించి తెల్లవారాక అంటే ద్వాదశి రోజున ఎవరికైన భోజనం పెట్టి ఉపవాస దీక్ష విరమిస్తే లక్ష్యం సిద్ధ్దిస్తుందని నమ్ముతారు. లోకాలన్నింటినీ పరిపాలించే శ్రీ మహావిష్ణువు జగద్రక్ష విధుల్లో అలసిపోయాక, విశ్రాంతి కోసం యోగానిద్రలోకి వెళ్లే రోజు తొలి ఏకాదశి. అందుకే దీన్ని శయనైకాదశిగా వ్యవహరిస్తారు. తిరిగి నాలుగు నెలల తర్వాత కార్తీక మాసంలోని ఏకాదశి రోజున మేల్కొంటాడు. దీన్ని ఉత్థాన ఏకాదశిగా, వైకుంఠఏకాదశిగా వ్యవహరిస్తారు. మహా విష్ణువు యోగానిద్రలో ఉన్నంత కాలం ఆయన ప్రసన్నత కోసం నాలుగు నెలల పాటు చాతుర్మాస వ్రతాలను పాటిస్తారు. ఈ కాలంలో వచ్చే వర్షాలతో క్రిమి కీటకాదులు సంచరిస్తాయి. కాబట్టి ఆశ్రమవాసులు అంతా బయటకు రాకుండా నాలుగు నెలలపాటు విష్ణువు నామస్మరణలో గడుపుతారు.
పుణ్యప్రదం ఏకాదాశి వ్రతం
చాతుర్మాస కాలంలో ఆహారనియమాలను పాటిస్తూ విష్ణు నామస్మరణలో కాలం గడిపితే పుణ్యప్రదమే కాకుండా ఆరోగ్య పరిరక్షణ కూడా జరుగుతుంది కాబట్టి పూర్వీకులు ఈనియమాన్ని విధించారు. ఏకాదాశి రోజు ఉపవాస దీక్ష, అశ్వమేథయాగం నిర్వహించిన ఫలితం ఉంటుందని విశ్వసిస్తారు. ఏకాదాశి రోజున నియమనిష్టలతో ఉపవాసం, రాత్రంతా జాగరణం చేసి స్వామిని సేవిస్తారు. మరుసటి రోజున ఉదయానే స్నానానంతరం శ్రీహరి పూజ, పురోహితులు పుణ్యమూర్తులను పిలిచి అన్నదానం చేసి తాము భూజించి దీక్ష విరమిస్తారు.
పిండి వంటలకు ప్రాధాన్యం
ప్రతి తొలి ఏకాదాశి పండగను హిందూవులు ఆర్భాటంగా జరుపుకోవడం ఆనవాయితీగా వస్తోంది. ఈ రోజున పిండి వంటలు చేసుకుంటారు.
తొలిపండుగ ఏకాదాశి ..
ఆషాఢ మాసం శుక్లపక్ష ఏకదశి నాడు విష్ణుమూర్తి పాల కడలిపై యోగానిద్రలోకి వెళ్లే సందర్భన్ని తొలిఏకదశిగా పరిగణిస్తారు. వానకాలంలో వచ్చే మెదటి ఏకాదశి కనుక దీనిని తొలి ఏకాదశి అని చెబుతారు పండితులు. ఏకాదశి అంటే పదకొండు, ఐదు జ్ఞానేంద్రియాలు, ఐదు కర్మేంద్రియాలు, మనస్సు కలిపి మొత్తం పద కొండు, వీటిని మనిషి తన ఆధీనంలోకి తీసుకవచ్చి వాటినన్నిటినీ ఒకటిగా చేసి, అప్పుడు దేవుడికి నివేదన చేయాలి. దీనివల్ల మనిషికి సహజంగా అలవడే బద్దకం దూరమవుతుందని, రోగాలు దరి చేరకుండా ఉంటాయని ఒక నమ్మకం.
-వైద్య శ్రీనివాస్ శర్మ పురోహితులు, మెదక్